కోజికోడ్, సెప్టెంబర్ 5: కరోనా కేసులతో సతమతమవుతున్న కేరళను మరోసారి నిఫా వైరస్ కలవరపెడుతున్నది. ఈ వైరస్తో కోజికోడ్ జిల్లాలోని మవూర్కు చెందిన 12 ఏండ్ల బాలుడు ఆదివారం మరణించినట్టు ఆ రాష్ట్ర ఆరోగ్యమంత్రి వీణా జార్జ్ తెలిపారు. తీవ్ర అస్వస్థతకు గురైన బాలుడిని దవాఖానలో చేర్పించామని, చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం 5 గంటలకు మృతి చెందినట్టు పేర్కొన్నారు. బాలుడి నుంచి సేకరించిన నమూనాలను పుణెలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపించినట్టు, వాటిని విశ్లేషించిన నిపుణులు నిఫా వైరస్ను గుర్తించినట్టు వెల్లడించారు. బాలుడితో సన్నిహితంగా ఉన్న కుటుంబ సభ్యులను ఐసోలేషన్కు తరలించినట్టు పేర్కొన్నారు. మరో 188 డైరెక్ట్ కాంటాక్ట్లను గుర్తించినట్టు తెలిపారు. ఇందులో ఇద్దరు ఆరోగ్య కార్యకర్తల్లో వైరస్ లక్షణాలు కనిపించాయన్నారు. మరో 20 మందిని హై-రిస్క్ క్యాటగిరీలో చేర్చినట్టు వివరించారు. పరిమిత కుటుంబ సభ్యుల సమక్షంలో బాలుడి మృతదేహానికి ఆదివారం అంత్యక్రియలు జరిపారు. ఈ సమయంలో వైద్యులు, దవాఖాన సిబ్బందితో పాటు బాలుడి బంధువులందరూ పీపీఈ కిట్లు ధరించారు.
అప్రమత్తమైన అధికారులు
మవూర్లో నిఫా వెలుగుచూడటంతో స్థానిక అధికారులు అప్రమత్తమయ్యారు. కోజికోడ్తో పాటు పొరుగు జిల్లాలకు ఈ వైరస్ వ్యాపించిందా? లేదా? అని గుర్తించే పనిలో మునిగిపోయారు. ఇంకోవైపు, కేరళలో నిఫా కలకలంతో కేంద్రప్రభుత్వం వైద్య బృందాన్ని రాష్ర్టానికి పంపించింది. కాగా 2018లో తొలిసారిగా కేరళలోని కోజికోడ్లో నిఫా వెలుగుచూసింది. ఈ వైరస్తో నెలవ్యవధిలోనే 17 మంది మరణించారు.
ఏమిటీ ‘నిఫా వైరస్’?
కొవిడ్-19 లాగానే ‘నిఫా’ కూడా జంతువుల నుంచి మనుషులకు సోకే ఓ జూనోటిక్ వైరస్. ఫ్లయింగ్ ఫాక్సెస్గా పిలిచే పండ్లు తినే గబ్బిలాల (ఫ్రూట్ బ్యాట్స్) ద్వారా ఈ వైరస్ జంతువులకు, మనుషులకు సోకుతుంది. పందులు, కుక్కలకు కూడా ఈ వైరస్ సోకినప్పటికీ, దీని ప్రభావం మనుషులపైనే ఎక్కువగా ఉంటుంది. ఈ వైరస్ను ‘ఆందోళన కలిగించే రకం’గా డబ్ల్యూహెచ్వో గుర్తించింది.
వ్యాధి లక్షణాలు
విపరీతమైన తలపోటు, బ్రెయిన్ ఫీవర్, నిరంతర దగ్గుతో కూడిన జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, తీవ్రశ్వాసకోశ సమస్యలు, కండరాల నొప్పి, వాంతులు, గొంతులో మంట, మైకం, మగతగా ఉండటం, మెదడువాపు, మూర్చ.
నియంత్రణ
రాలిన పండ్లు, ఎండిన కాయలను తినకపోవడం, అస్వస్థతకు గురైన జంతువులకు, మనుషులకు దూరంగా ఉండటం, అన్ని కరోనా నియమాలను పాటిస్తే ‘నిఫా’ను నియంత్రించవచ్చు.
చికిత్స
‘నిఫా’ కట్టడికి ఎలాంటి వ్యాక్సిన్ లేదు. శ్వాస సమస్యలు ఉన్నవారికి ఐసీయూ చికిత్స ఇస్తారు. రోగనిరోధక శక్తిని పెంచే బలవర్ధకమైన ఆహారాన్ని అందజేస్తారు.