ముంబై: ముంబై మాజీ పోలీస్ చీఫ్ పరంబిర్ సింగ్ను ఎన్ఐఏ బుధవారం ప్రశ్నించింది. రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ ఇంటి వద్ద కలకలం రేపిన పేలుడు పదార్థాలతో కూడిన వాహనం కేసుతోపాటు, వాహనం యజమాని మన్సుఖ్ హిరేన్ హత్య కేసులో ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సస్పెండైన పోలీస్ అధికారి సచిన్ వాజేతో ఆయన సంబంధాలపై ఆరా తీసింది. పరంబిర్ సింగ్ బుధవారం ఉదయం 9.30 గంటలకు ముంబైలోని ఎన్ఐఏ కార్యాలయానికి చేరుకున్నారు. మధ్యాహ్నం 1.30 గంటలకు కార్యాలయం నుంచి ఆయన బయటకు వెళ్లారు. ఈ నేపథ్యంలో పరంబిర్ సింగ్ను ఎన్ఐఏ అధికారులు సుమారు మూడు గంటలపాటు ప్రశ్నించినట్లు తెలుస్తున్నది.
పరంబిర్ సింగ్ ముంబై పోలీస్ చీఫ్గా ఉన్నప్పుడే గతంలో సస్పెండైన సచిన్ వాజేను తిరిగి విధుల్లోకి తీసుకున్నారు. ఆయనకు నేర దర్యాప్తు విభాగంలో కీలక బాధ్యతలు అప్పగించారు. సచిన్ వాజే నేరుగా పరంబీర్ సింగ్కు రిపోర్టు చేసేవారని, సన్నిహితంగా ఉండటంతోపాటు ఆయన ఆదేశాల మేరకు వ్యవహరించినట్లు ప్రస్తుత ముంబై పోలీస్ చీఫ్ హేమంత్ నాగ్రాలే ఒక నివేదికను రాష్ట్ర హోంశాఖకు సమర్పించినట్లు మీడియాలో వార్తా కథనాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో సచిన్ వాజేతో సంబంధాలు, ఆయనపై ఉన్న కేసుల గురించి పరంబిర్ సింగ్ను ఎన్ఐఏ ప్రశ్నించింది.
నెలకు వంద కోట్లు వసూళ్లు చేయాలని మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్ముఖ్ సచిన్ వాజేకు టార్గెట్ పెట్టినట్లు పరంబిర్ సింగ్ ఆరోపించిన సంగతి తెలిసిందే. దీనిపై సీబీఐతో దర్యాప్తు కోసం బాంబే హైకోర్టును ఆశ్రయించగా ప్రాథమిక దర్యాప్తునకు ఆదేశించింది. దీంతో అనిల్ దేశ్ముఖ్ హోంమంత్రి పదవికి సోమవారం రాజీనామా చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో పరంబిర్ సింగ్ను ఎన్ఐఏ అధికారులు ప్రశ్నించడం ప్రాధాన్యత సంతరించుకున్నది.