హన్మకొండ సిటీ, ఏప్రిల్ 20 : కార్పొరేషన్ ఎన్నికలు సజావుగా జరిగేలా పోలీస్ సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని పోలీస్ కమిషనర్ తరుణ్జోషి పిలుపునిచ్చారు. ఈమేరకు సోమవారం మంగళవారం రాత్రి కమిషనరేట్లో పోలీసు అధికారులు, సిబ్బందితో వీడియో సమావేశం నిర్వహించారు. ఇక్కడ సీపీ మాట్లాడుతూ ప్రజలు తమ ఓటు హక్కును నిర్భయంగా వినియోగించుకునేలా స్వేచ్ఛాయుత వాతావరణం కల్పించాల్సిన బాధ్యత మనదేనన్నారు. ముఖ్యంగా ఎన్నికల ప్రచారంతో పాటు పోలింగ్ రోజున ఎలాంటి ఘటనలకు తావు లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని చెప్పారు. అదే సమయంలో ఎన్నికల నియమావళిని ఉల్లంఘించే వారిపై కేసులు నమోదు చేయడంతో పాటు రౌడీషీటర్లు, పాత నేరస్తులను తక్షణమే బైండోవర్ చేయాలన్నారు. రాత్రివేళ తనిఖీలు ముమ్మరం చేస్తూ వీడియోగ్రఫీ చేయాలని చెప్పారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ ఎన్నికల విధులను సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. ఆ తర్వాత పబ్లిక్ ప్రాసిక్యూటర్ సత్యనారాయణ, ఇన్స్పెక్టర్ సీతారాంరెడ్డి, ప్రధానోపాధ్యాయుడు వేణు ఆనంద్ ఎన్నికల సందర్భంగా పాటించాల్సిన నియమాలు, అతిక్రమించే వారిపై నమోదు చేసే కేసులపై అధికారులు, సిబ్బందికి వివరించారు. సమావేశంలో ఈస్ట్జోన్ డీసీపీ వెంకటలక్ష్మి, సెంట్రల్ జోన్ ఇన్చార్జి డీసీపీ పుష్ప, ఎస్బీ అదనపు డీసీపీ జనార్దన్, ఎస్బీ, ఐటీ, సీపీఆర్బి, కమ్యూనికేషన్ ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు.