న్యూఢిల్లీ : జీపీఎస్ ఆధారిత వ్యవస్థ ద్వారా టోల్ వసూలు ప్రక్రియను వేగవంతం చేయాలని నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఎన్ హెచ్ఏఐ) నిర్ణయించింది. ఈ ప్రక్రియను ముందుకు తీసుకువెళ్లేందుకు కన్సల్టెంట్ నియామకానికి బిడ్లను ఆహ్వానించింది. జీపీఎస్ ఆధారిత టోలింగ్ పై సాంకేతిక కన్సల్టెంట్ సమగ్ర రోడ్ మ్యాప్ రూపొందించి ఎన్ హెచ్ఏఐకు అందచేయడం జరుగుతుంది.
దేశవ్యాప్తంగా జాతీయ రహదారులపై టోల్ గేట్స్ లేకుండా జీపీఎస్ ఆధారిత టోల్ వసూలుకు చట్టాల్లో చేయాల్సిన మార్పుల గురించి కూడా సాంకేతిక కన్సల్టెంట్ సూచనలు చేస్తుంది. మరో రెండేండ్లలో దేశంలో టోల్ ప్లాజాలు కనుమరుగవుతాయని గత ఏడాది డిసెంబర్ లో జాతీయ రహదారులు, ఉపరితల రవాణా మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్న సంగతి తెలిసిందే. మరోవైపు త్వరలోనే కొన్ని జాతీయ రహదారులపై ప్రయోగాత్మకంగా నూతన టెక్నాలజీని పరీక్షిస్తామని ఎన్ హెచ్ఏఐ చైర్మన్ ఎస్ఎస్ సంధూ ఇటీవల వెల్లడించారు.