న్యూఢిల్లీ, జూలై 16: కరోనా కట్టడిలో రానున్న 100-125 రోజులు అతి కీలకమని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. దేశం ఇంకా హెర్డ్ ఇమ్యూనిటీకి (సామూహికంగా రోగనిరోధకశక్తి సంతరించుకోవడం) చేరుకోలేదని పేర్కొన్నది. కొత్త వేరియంట్లు దాడిచేయొచ్చని హెచ్చరించింది. ఈ మేరకు శుక్రవారం కేంద్ర ఆరోగ్యశాఖ ఏర్పాటు చేసిన సమావేశంలో నీతిఆయోగ్ సభ్యుడు (ఆరోగ్యం) డాక్టర్ వీకేపాల్ మాట్లాడారు. కొవిడ్-19 నిబంధనలను కచ్చితంగా పాటిస్తేనే వైరస్ వ్యాప్తిని కట్టడి చేయవచ్చన్నారు. ప్రపంచంలోని పలు దేశాల్లో కరోనా మళ్లీ విజృంభిస్తున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. థర్డ్వేవ్ దిశగా కదులుతున్నామనడానికి ఇది సంకేతమన్నారు. వైద్యరంగంలో మౌలిక సదుపాయాల సామర్థ్యాన్ని పెంచుకోవాలన్నారు. కేంద్ర ఆరోగ్య సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ మాట్లాడుతూ.. మయన్మార్, బంగ్లాదేశ్లో ఇప్పటికే మొదలైన థర్డ్వేవ్ ప్రభావం.. సెకండ్వేవ్తో పోలిస్తే తీవ్రంగా ఉన్నదన్నారు. లాక్డౌన్ ఎత్తేశాక, మాస్కుల వాడకం దాదాపు 74 శాతం తగ్గిందని ఆందోళన వ్యక్తం చేశారు.
పిల్లలు జాగ్రత్త!
పిల్లలు కరోనాబారిన పడే ప్రమాదాన్ని కొట్టిపారేయలేమని లవ్ అగర్వాల్ హెచ్చరించారు. కొవిడ్-19 నిబంధనలను పకడ్బందీగా పాటిస్తూ చిన్నారులను మహమ్మారి నుంచి కాపాడుకోవాల్సిన అవసరమున్నదన్నారు.
టీకాలతో 95% తగ్గిన మరణాల రేటు: వీకే పాల్
రెండో వేవ్లో కరోనా మరణాలను తగ్గించడంలో టీకాలు అత్యంత కీలక పాత్ర పోషించాయని వీకే పాల్ అన్నారు. రెండు డోసులు వేసుకొన్నవారిలో మరణాల రేటు 95 శాతం తగ్గిందని పేర్కొన్నారు. ఒక్క డోసు వేసుకొన్నవారిలో ఇది 82 శాతం ఉందన్నారు. గడిచిన వారం రోజుల్లో దేశవ్యాప్తంగా 73 జిల్లాల్లో మాత్రమే రోజుకు 100 కంటే ఎక్కువ కరోనా కేసులు నమోదు అవుతున్నాయని లవ్ అగర్వాల్ తెలిపారు. 47 జిల్లాల్లో పాజిటివిటీ రేటు 10శాతం కంటే ఎక్కువుందని చెప్పారు.