హైదరాబాద్, మే 5 (నమస్తే తెలంగాణ): కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో విపత్తుల నిర్వహణ చట్టంలోని సెక్షన్-17 ప్రకారం రెండ్రోజుల్లో విపత్తుల నిర్వహణ కమిటీని ఏర్పాటు చేయాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. కేసులు పెరుగుతున్నందున వైరస్ నిర్ధారణ పరీక్షల సంఖ్య పెంచాలని సూచించింది. కరోనాపై దాఖలైన రెండు ప్రజాహిత వ్యాజ్యాలపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమాకోహ్లీ, జస్టిస్ బీ విజయ్సేన్రెడ్డితో కూడిన ధర్మాసనం బుధవారం మరోసారి విచారణ చేపట్టింది.
ఈ నెల 8తో ముగిసే రాత్రి కర్ఫ్యూ తర్వాత ఏం చేస్తారని, నిర్ణయమేదైనా ముందే తీసుకోవాలని చెప్పింది. లాక్డౌన్ విధింపు ప్రతిపాదనపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుందో చెప్పాలని అడిగింది. విచారణకు ఆన్లైన్లో హాజరైన డీజీపీ మహేందర్రెడ్డి, వైద్య ఆరోగ్య శాఖ డైరెక్టర్ శ్రీనివాసరావు.. ప్రభుత్వం తీసుకొంటున్న కఠిన చర్యలను కోర్టుకు వివరించారు. రాష్ర్టానికి ఆక్సిజన్ డిమాండ్కు తగ్గట్టుగా సరఫరా చేయడంలో కొంత సమస్య ఉందని శ్రీనివాసరావు చెప్పారు. ప్రస్తుతానికి నిల్వలు ఉన్నాయని, కొరత లేకుండా జాగ్రత్తలు తీసుకొంటున్నామని తెలిపారు.
బెడ్స్ కూడా పూర్తిస్థాయిలో అన్ని చోట్ల అందుబాటులో ఉన్నాయని వివరించారు. కేంద్ర ప్రభుత్వం రెమ్డెసివిర్ ఇంజక్షన్లను అరకొరగా కేటాయిస్తున్నదని వెల్లడించారు. తమిళనాడులోని శ్రీపెరంబదూర్ నుంచి రాష్ర్టానికి రావాల్సిన ఆక్సిజన్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతున్నందున ఇతర రాష్ర్టాల నుంచి ఆక్సిజన్ కేటాయించాలని కేంద్రాన్ని హైకోర్టు ఆదేశించింది. రాష్ట్రంలో మే 2న 58,742 టెస్ట్లు మాత్రమే చేశారని, లక్షకు తగ్గకుండా పరీక్షలు చేయాలని చెప్పింది.
ఖైదీలు, నిరాశ్రయులు, వీధి పిల్లలకు వ్యాక్సిన్ ఏవిధంగా వేస్తున్నారో చెప్పాలని అడిగింది. ప్రైవేటు దవాఖానల్లో కరోనా చికిత్సకు ఒకే ధర ఉండేలా ఉత్తర్వులు ఇవ్వాలని, సీటీ స్కాన్కు నిర్ధిష్ట ధర నిర్ణయించాలని కోర్టు సూచించింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు డీజీపీ, వైద్యారోగ్యశాఖ డైరెక్టర్, జైళ్ల శాఖ డీజీలు నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 13కి వాయిదా వేసింది.