ఆగ్రా: ఆ ఇంట్లో మూడు వారాల క్రితం అంగరంగ వైభవంగా వివాహం జరిగింది. కొత్త కోడలు ఇంట్లో అడుగుపెట్టింది. కొడుకు, కోడలు చిలుకా గోరింకల్లా కలిసిపోయారు. ఇది చూసి ఆమె అత్తమామలు మురిసిపోయారు. కానీ వాళ్ల మురిపెం మూన్నాళ్ల ముచ్చటగానే మిగిలిపోయింది. పెండ్లయిన మూడు వారాలకే కొత్త కోడలు అత్తింటి వాళ్లకు టోకరా ఇచ్చింది. భర్త, అత్తమామలకు పాలల్లో మత్తు కలిపి ఇచ్చి నగలు, పట్టుచీరలతో పారిపోయింది.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఆగ్రా రూరల్ ఏరియాలోని బాహ్ సిటీలో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. బాహ్ సిటీకి చెందిన ఉపేంద్ర (22)కు ఈ నెల 7న శాలిని (20)తో వివాహం జరిగింది. ఈ మూడు వారాల్లో అత్తింటి వారితో బాగానే కలిసిపోయింది. కానీ, సోమవారం రాత్రి భర్తకు, అత్తమామలకు పాలల్లో మత్తు మందు కలిపి ఇచ్చింది. వాళ్లు ఆ పాలుతాగి మత్తులోకి జారుకోగానే ఇంట్లో విలువైన నగలు, బట్టలు తీసుకుని ఉడాయించింది.
ఉదయం లేచి చూసిన అత్తమామలకు ఇంట్లో కోడలు కనిపించలేదు. ఉపేంద్ర, అతని పేరెంట్స్ అంతా వెతికినా ఆమె జాడ తెలియలేదు. చివరికి అనుమానం వచ్చి బీరువా తీసి చూడగా అందులోని విలువైన నగలు, బట్టలు మాయమయ్యాయి. దాంతో కొత్త కోడలే ఇంటికి కన్నం వేసిందనే విషయం అర్థమయ్యింది. దాంతో ఉపేంద్ర తండ్రి ఠాకూర్ దాస్ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.