సిటీబ్యూరో, ఏప్రిల్ 28(నమస్తే తెలంగాణ): కరోనా కరాళ నృత్యం చేస్తున్నది. కొవిడ్ సెకండ్ వేవ్ జన జీవనాన్ని అతలాకుతలం చేస్తోంది. చాలా మంది ప్రజలు ఇంటికే పరిమితమయ్యారు. కొవిడ్ రోగులతో నిండిన దవాఖానాల వైపు చాలా మంది కన్నెత్తి కూడా చూడాలనుకోవడం లేదు. రోగాలు, దవాఖానాలు, డయాలసిస్ కేంద్రాలు, మెడికల్ హాళ్ల పేరు చెబితేనే జనం భయభ్రాంతులకు గురవుతున్నారు. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వచ్చినా.. దవాఖాన మెట్లు ఎక్కేందుకు మాత్రం ఆసక్తి చూపడం లేదు. కాని, కిడ్నీ సమస్యలతో బాధపడుతూ డయాలసిస్కు చేయించుకోదల్చిన వారు మాత్రం రోజు విడిచి రోజు కరోనా రోగులను దాటుకుంటూ దవాఖాన మెట్లు ఎక్కాల్సిందే. వారంలో మూడు రోజులు డయాలసిస్ చేయించుకోకుంటే వాళ్ల రక్తంలో చెడు రక్తం, మలినాలు పెరిగి పరిస్థితి చేయి దాటే ప్రమాదముంటది. నగరంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 12వేల పైచిలుకు డయాలసిస్/కిడ్నీ మార్చుకున్న పేషెంట్లు ప్రతిరోజు దవాఖానకు, మెడికల్ షాపునకు, మార్కెట్కు వెళ్లక తప్పదు. ఈ క్రమంలోనే రాష్ట్రంలో ఇప్పటి వరకు (ఏపీ, తెలంగాణలో కలిపి) 18 మంది డయాలసిస్ రోగులు, 25 మంది కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకున్న వ్యక్తులు కొవిడ్ వైరస్ బారిన పడి మృతి చెందారు. మరికొందరు కొవిడ్తో పోరాడుతున్నారు. ఈ క్రమంలోనే డయాలసిస్ రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై నిమ్స్ నెఫ్రాలజీ ప్రొఫెసర్ డాక్టర్ శ్రీభూషణ్ రాజు ‘నమస్తే తెలంగాణ’తో తన అభిప్రాయాలను పంచుకున్నారు.
డయాలసిస్ రోగులకు ఇమ్యూనిటీ..
సాధారణంగా డయాలసిస్ రోగులకు మం చి డైట్ ఉంటుంది. వాళ్లు డాక్టర్ల సలహాల మేర కు మటన్, చికెన్, ఫిష్, గుడ్లను క్రమంగా తప్పకుండా డాక్టర్లు ఇచ్చిన డైట్ ప్రకారం తీసుకుంటారు. కావున, డయాలసిస్ రోగులకు ఇమ్యూనిటీ ఉంటుంది. అలాగని నిర్లక్ష్యం చేయొద్దు. కచ్ఛితంగా కొవిడ్ నిబంధనలను పాటించాలి. బయటకు వెళ్లి వచ్చిన వెంటనే స్నానం చేయడం ఉత్తమం.
తెల్లవారు జామున జాగ్రత్త..
ప్రస్తుతం కరోనాతో పాటు ఎండలు కూడా చాలా తీవ్రంగా ఉన్నా యి. నిత్యం 3-4 గంటల పాటు డయాలసిస్ చేయడం వలన డయాలసిస్ పేషెంట్లలో బీపీ లెవల్స్ ఒక్కసారిగా డౌన్ అయ్యే పరిస్థితి ఉంది. అలాగే, రాత్రి తిని పడుకున్న తరువాత తెల్లవారు జామున అంటే సుమారు 3-4 గంటల సమయంలో షుగర్ లెవల్స్ కూడా పడిపోయే అవకాశం ఉంది. ఆ సమయంలో వెంటనే గ్లూకోవిట్ను అందుబాటులో ఉంచుకోవాలి. ఒక స్వీట్ తీసుకోవాలి. అలాగే, ఇంట్లో తినడానికి అవసరమైన ఫుడ్ను అందుబాటులో ఉంచుకోవాలి.
క్రమశిక్షణ గల రోగులు..
డయాలసిస్ పేషెంట్లు గాని, కిడ్నీ సంబంధ ఇబ్బందులతో బాధపడుతున్న వాళ్లు అత్యంత క్రమశిక్షణతో ఉంటారు. గతంలో వీళ్లు చాలా ఇబ్బందులను ఎదుర్కొని ఉంటారు. కాబట్టి, డాక్టర్ల సూచనలతో పాటు కొవిడ్ నిబంధనలను తప్పక పాటిస్తారు. అలాగే, వీళ్లు రోజు విడి రోజు డయాలసిస్కు వెళ్లొస్తారు. కనుక, అలసిపోయి విశ్రాంతి తీసుకుంటారు. చెడు తిరుగుళ్లు తిరగరు. పది మందిలో కలిసి బాతకాని పెట్టరు.
సెకండ్ వేవ్.. తీవ్రంగా..
కరోనా మొదటి వేవ్తో పోల్చితే.. సెకండ్ వేవ్ చాలా తీవ్రంగా ఉంది. అయితే డయాలసిస్/కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అయిన వాళ్లలో కొవిడ్ మాత్రం చాలా తక్కువగా ఉంది. బయట సాధారణ ప్రజలకు ఉన్న స్థాయిలో కిడ్నీ వ్యాధిగ్రస్తులకు లేదు. అయితే, కిడ్నీ రోగులు బయట తిరిగి వచ్చే కుటుంబ సభ్యులకు దూరంగా ఉండాలి. ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసిన గదిలోనే ఉండాలి. ఎందుకంటే ప్రస్తుత డయాలసిస్ రోగులు అయి ఉండి కొవిడ్ బారిన పడిన వారికి దాదాపుగా వాళ్ల వాళ్ల కుటుంబ సభ్యుల ద్వారానే వచ్చింది తప్ప.. డయాలసిస్ కేంద్రాల ద్వారా వ్యాప్తి అనేది జరుగలేదు. కనుక, డయాలసిస్ పేషెంట్లు ఎలాంటి భయం పెట్టుకోకుండా ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం, ధైర్యంగా వచ్చి డయాలసిస్ చేయించుకోవాలి. గతంలో ఉచిత డయాలసిస్ లేక చాలా మంది ఇబ్బందులు పడ్డారు. కాని, ఇప్పుడు ఉచిత డయాలసిస్కు సంబధించిన సమాచారం/అవగాహన లేమితో ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ప్రభుత్వం కల్పించిన ఈ సదవకాశాన్ని కచ్ఛితంగా సద్వినియోగం చేసుకోవాలి.
ప్రైవేట్ కంటే మెరుగైన సేవలు..
ప్రభుత్వం ఏర్పాటు చేసిన డయాలసిస్ సెంటర్లు ప్రైవేటు కంటే మెరుగ్గా ఉన్నాయి. ఇక్కడ అత్యంత నాణ్యమైన పరికరాలను అందుబాటులో ఉంచారు. కావున, ప్రైవేటు దవాఖానాలకు పోయి డయాలసిస్ చేయించుకోవడం కంటే ప్రభుత్వ దవాఖానాలలో ఏర్పాటు చేసిన ఉచిత డయాలసిస్ కేంద్రాలను కిడ్నీ వ్యాధిగ్రస్తులు ఆశ్రయించాలి. వచ్చే జూన్ వరకు సాధారణ ప్రజలతో పాటు కిడ్నీ రోగులు మరింత అప్రమత్తంగా ఉండాలి. డయాలిసిస్ రోగులు సొంత ప్రయోగాలు ఎట్టి పరిస్థితుల్లోనూ చేయొద్దు.