హైదరాబాద్, ఏప్రిల్ 18 (నమస్తే తెలంగాణ): సింగపూర్ శ్రీ సాంస్కృతిక కళాసారథి సంస్థ ఆధ్వర్యంలో ప్రముఖ సంగీత విద్వాంసులు గరికిపాటి వెంకట ప్రభాకర్ నిర్వహించిన ‘రాగావధానం’ కార్యక్రమం అలరించింది. ఆదివారం అంతర్జాలంలో 5 గంటలపాటు వినూత్నంగా ఏర్పాటుచేసిన ఈ కార్యక్రమం సంగీత ప్రియులను కట్టిపడేసింది. గరికిపాటి వెంకట ప్రభాకర్, పద్మ లలిత దంపతులు ప్రారంభించిన ఈ కార్యక్రమంలో అమెరికా నుంచి డాక్టర్ వంగూరి చిట్టెన్ రాజు, భారతదేశం నుంచి డాక్టర్ వంశీ రామరాజు, ప్రముఖ గాయకులు జీ ఆనంద్, ప్రఖ్యాత గాయని సురేఖమూర్తి తదితరులు గౌరవ అతిథులుగా పాల్గొన్నారు. సాహిత్య అష్టావధాన ప్రక్రియలోలాగే సింగపూర్ నుంచి గాయనీ గాయకులు విద్యాధరి, శేషుకుమారి, సౌభాగ్యలక్ష్మి, షర్మిల, పద్మావతి, స్నిగ్ధ, అనంత్ పృచ్ఛకులుగా వ్యవహరించగా, రాధిక మంగిపూడి సమన్వయకర్తగా వ్యవహరించారు. అమెరికా, హాంగ్కాంగ్, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, నార్వే తదితర దేశాల్లో తెలుగు ప్రజలు ఈ కార్యక్రమాన్ని వీక్షించి ఆనందించారు.