చెన్నై : తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కేబినెట్లో గాంధీ, నెహ్రూకు చోటు లభించడమేంటని అనుకుంటున్నారా? ఇది నిజమే. ఎందుకంటే ఆ ఇద్దరు నాయకుల తండ్రులు.. గాంధీ, నెహ్రూ మీద అభిమానంతో వారికి ఆ పేర్లను నామకరణం చేశారట. అలా ఆ నాయకుల ఇద్దరి పేర్లు గాంధీ, నెహ్రూగా కొనసాగుతున్నాయి.
తమిళనాడు సీఎంగా ఎంకే స్టాలిన్ ప్రమాణం చేయగా, 34 మందితో మంత్రివర్గం కొలువుదీరింది. వీరిలో ఇద్దరు మహిళలకు, ఒక మైనార్టీకి ప్రాధాన్యం కల్పించారు.
తిరుచిరాపల్లి వెస్ట్ నియోజకవర్గం నుంచి గెలుపొందిన కేఎన్ నెహ్రూకు స్టాలిన్ మంత్రివర్గంలో చోటు లభించింది. ఆయనకు మున్సిపల్ శాఖను కేటాయించారు. గత డీఎంకే గవర్నమెంట్లో నెహ్రూ ఇదే శాఖను నిర్వర్తించారు. నెహ్రూ తండ్రి కాంగ్రెస్ మద్దతుదారుడు. అంతేకాకుండా మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ అంటే ఎంతో అభిమానం. ఆ అభిమానంతోనే కేఎన్ నెహ్రూకు ఆయన తండ్రి నెహ్రూ అని నామకరణం చేశారు.
రాణిపేట నియోజకవర్గం నుంచి గెలుపొందిన ఆర్ గాంధీ.. హ్యాండ్లూమ్, టెక్స్టైల్ మంత్రిగా ప్రమాణం చేశారు. 1996, 2006, 2016 ఎన్నికల్లో గాంధీ అసెంబ్లీకి ఎన్నికయ్యారు.