న్యూఢిల్లీ, ఆగస్టు 3: గుర్తుతెలియని వాహన ప్రమాదంలో (హిట్ అండ్ రన్ కేసులు) మరణించిన బాధిత కుటుంబాలకు ఇచ్చే నష్టపరిహారాన్ని ప్రభుత్వం ఎనిమిది రెట్లు పెంచనున్నది. ఈ తరహా కేసుల్లో గాయపడిన బాధితులకు చెల్లించే పరిహారాన్ని నాలుగు రెట్లు పెంచనున్నారు. అలాగే పరిహారం విడుదలలో జాప్యం లేకుండా తగిన చర్యలు చేపట్టనున్నారు. ఈ మేరకు రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు విడిచిన లేదా గాయాలపాలైన బాధితులకు సత్వర ఆర్థిక సాయం అందించడానికి కేంద్రప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్టు తెలుస్తున్నది. దీనికి సంబంధించిన నిబంధనలపై ఇప్పటికే కేంద్ర రోడ్డు, రవాణా మంత్రిత్వ శాఖ తుది నిర్ణయం తీసుకున్నట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. త్వరలో వీటిని ఆమోదించనున్నట్టు సమాచారం.