న్యూఢిల్లీ: పంజాబ్ క్యాబినెట్ రేపు కొలువుదీరనుంది. పంజాబ్ కొత్త ముఖ్యమంత్రి చరణ్జీత్ సింగ్ చన్నీ.. కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకుడు రాహుల్గాంధీతో చర్చించి తన క్యాబినెట్లో చేరబోయే వారి పేర్లను ఖరారు చేశారు. నూతన మంత్రివర్గాన్ని ఖరారు చేయడం కోసం చన్నీ.. సోమవారం తను ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసినప్పటి నుంచి మూడుసార్లు ఢిల్లీకి వెళ్లారు. రాహుల్గాంధీతో చర్చించారు. చివరికి 15 మంది పేర్లను ఖరారు చేశారు. ఈ 15 మంది కొత్త మంత్రులు రేపు ప్రమాణస్వీకారం చేయనున్నారు.
చన్నీ మంత్రివర్గంలో ఏడు కొత్త ముఖాలు కనిపించనున్నట్లు సమాచారం. అదేవిధంగా కెప్టెన్ అమరీందర్సింగ్ ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసిన ఐదుగురికి కొత్త క్యాబినెట్లో చోటుదక్కలేదని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు అమరీందర్ సింగ్కు విశ్వాసపాత్రులైన కొందరికి మంత్రివర్గంలో చోటుకల్పించినా మరికొందరికి మొండి చేయి చూపినట్లు తెలిసింది. రాజ్కుమార్ వెర్క, కుల్జీత్ నగ్రా, గుర్కీరత్సింగ్ కొట్లీ, పర్గత్సింగ్, రాజా వారింగ్, రాణా గుర్జీత్, సుర్జీత్సింగ్ ధిమాన్ అనే ఈ ఏడుగురు ఎమ్మెల్యేలు పంజాబ్ క్యాబినెట్లో కొత్తగా చోటు దక్కించుకున్నట్లు సమాచారం.
అదేవిధంగా, మాజీ ముఖ్యమంత్రి అమరీందర్సింగ్కు విశ్వాసపాత్రులైన బ్రహ్మ్ మొహింద్రా, విజేంద్ర సింఘ్లా, భరత్భూషణ్ అషులకు చన్నీ మంత్రివర్గంలో చోటు కల్పించినట్లు తెలిసింది. అయితే, అమరీందర్ మంత్రివర్గంలోని ఆరోగ్యమంత్రి బల్బీర్ సిధూ, అటవీశాఖ మంత్రి సాధూసింగ్ ధరమ్సోట్, క్రీడా శాఖ మంత్రి రాణా, మరో ముగ్గురు మంత్రులు గుర్మీత్ సోధీ, ఎస్ఎస్ అరోరా, గుర్ప్రీత్ కంగర్లకు చన్నీ మంత్రివర్గంలో చోటుదక్కలేదని సమాచారం.