న్యూఢిల్లీ, సెప్టెంబర్ 25: సహకార రంగానికి ఊతమిచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం త్వరలో నూతన పాలసీని తీసుకురానుంది. దేశాన్ని 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా రూపొందించేందుకు సహకార సంఘాలు కూడా కీలకపాత్ర పోషిస్తాయని, ఈ దిశగా త్వరలో కొత్త సహకార విధానాన్ని ప్రకటిస్తామని కేంద్ర హోం, సహకార మంత్రి అమిత్ షా తెలిపారు. శనివారం ఢిల్లీలో జరిగిన జాతీయ సహకార సదస్సులో షా మాట్లాడారు. ఈ ఏడాది జూలైలో కేంద్రం సహకార మంత్రిత్వ శాఖను కొత్తగా ఏర్పాటుచేసింది. సహకార సంఘాలు రాష్ర్టాల పరిధిలో ఉన్న నేపథ్యంలో సహకార రంగాన్ని పటిష్టపర్చి, ఆధునీకరించేందుకు ఈ శాఖను ఏర్పాటుచేసినట్లు అమిత్ షా తెలిపారు. వివిధ రాష్ర్టాల సహకార చట్టాల్ని ప్రభుత్వం సవరిస్తుందని, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్ని ఆధునీకరించి, డిజిటలైజ్ చేయనున్నట్లు షా తెలిపారు. ప్రస్తుతం దేశంలో ప్రతీ 10 గ్రామాలకు ఒక వ్యవసాయ సహకార సంఘం ఉందని, ప్రతీ గ్రామంలోనూ ఒక సంఘం ఉండేలా వచ్చే ఐదేండ్లలో ఈ సంఘాల సంఖ్యను 3 లక్షలకు పెంచుతామన్నారు.