మెళకువలు పాటిస్తే మేలైన దిగుబడి
భారీ రాయితీలో రైతులను ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం
మంచిర్యాల జిల్లాలో రెండు వేల హెక్టార్లలో తీగజాతి కూరగాయల సాగు
మంచిర్యాల అర్బన్, మార్చి 29 : పందిరి సాగు రైతన్నకు మంచి లాభాలు తెస్తున్నది. ముఖ్యమంత్రి ఆదేశాలతో ఉద్యానవన శాఖ సబ్సి డీ అందించి రైతులను ప్రోత్సహిస్తున్నది. కూరగాయలకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉండడంతో రైతులను ప్రోత్సహిస్తున్నది. అర ఎకరంలో పంది రి సాగుకు సుమారు రూ.2 లక్షల వరకు ఖర్చవుతుంది. ఇందుకోసం ప్రభుత్వం రూ.1,15,700 రాయితీ ఇస్తున్నది. వీటిని సిమెంట్ లేదా స్టోన్ పిల్లర్లు, వైర్లు వేసేందుకు కూలీల ఖర్చు కోసం వినియోగించుకోవాలి. మార్కెట్ సౌకర్యం, కావాల్సిన పరికరాలను అందుబాటులోకి తేవడంతో రైతులు పందిరి సాగుపై ఆసక్తి చూపుతున్నారు. మంచి లాభాలుండడంతో జిల్లాలో సాగు చేసే రైతుల సంఖ్య పెరుగుతున్నది. ఈ సీజన్ అనువైనది కావడంతో జిల్లాలో రెండు వేల హెక్టార్లలో సాగు చేస్తున్నారు. ఈ సీజన్లో సాగు ప్రారంభిస్తే మంచి దిగుబడులతోపాటు ధర లభించే అవకాశం ఉంది.
విత్తన శుద్ధి..
ఎండాకాలం సోరకాయ, పొట్ల, కాకర, బీర, చిక్కుడు, దోస, దొండ పండించడానికి అనుకూలం. ఏ కూరగాయల పంటైనా నాణ్యమైన విత్తనాలను ఎంపిక చేసుకొని నాటుకోవాలి. ముందు విత్తనశుద్ధి తప్పని సరిగా చేయాలి. కిలో విత్తనానికి మూడు గ్రాముల థైరమ్, ఐదు గ్రాము ల ఇమిడాక్లోరిఫైడ్ ఒక దాని తర్వాత ఒకటి కలిపి విత్తనశుద్ధి చేయాలి.
విత్తే పద్ధతి..
పంటలు తీగజాతికి చెందినవి కావడంతో వీటిని పందిర్లపైన, ఎండిన పెద్ద వంగ మొక్కలపై ఎక్కించి సాగు చేయవచ్చు. మురుగునీరు పో యేందుకు, సాగునీరు పెట్టేందుకు కాలువలను ఏర్పాటు చేయాలి. విత్తనాలు నాటే ముందు ప్రతి కుదురు దగ్గర మూడు విత్తనాలను 1 లేదా 2 సెంటీమీటర్ల లోతులో విత్తుకోవాలి. దొండకు చూపుడు వేలు లావుగల కొమ్మలు 4 కణువులు గలవి రెండు చొప్పున నాటు కోవాలి. పంటలు వేసినప్పుడు మొలకలు వచ్చిన తర్వాత తీగకు దారం కాని, పురికొన కాని కట్టి వెదుర్లకు అనుసంధానం చేయాలి.
ఎరువుల యాజమాన్యం..
పందిరి సాగులో సరైన యాజమాన్య పద్ధతు లు, సంరక్షణ చర్యలు చేపడితే అధిక దిగుబడులు సాధించవచ్చని ఉద్యానవన శాఖ అధికారులు చెబుతున్నారు. మొక్కనాటే ముందే బోదెల కింద ఎకరానికి 20 టన్నుల పశువుల ఎరువు, 500 కిలోల వేప పిండి, 40 నుంచి 50 కిలోల నత్రజని సమానంగా చేసి డ్రిప్ ద్వారా అందించాలి. శాఖీయ దశలో 19ః19ః19, పూత, కాయ దశలో 13ః0ః45 అందించాల్సి ఉంటుంది. కలుపు మొక్కలను ఎప్పటికప్పుడు తీసేయాలి. బోరాక్స్ను పిచికారీ చేయడంతో ఆడ పూలు ఎక్కువగా వచ్చి అధిక దిగుబడులు వస్తాయి.
నీటి యాజమాన్యం..
గింజ మొలకెత్తే వరకు 3 నుంచి 4 రోజులకోసారి నీటి తడులివ్వాలి. మల్చింగ్ పద్ధతి ద్వారా కలుపు నివారించడంతోపాటు నీటిని సద్వినియో గం చేసే అవకాశం ఉంటుంది. డ్రిప్ పద్ధతి ద్వారా నీటిని అందించడంతోపాటు నీటిలో కరిగే మందులను అందిస్తే వృథా కావు. దిగుబడులు ఎక్కువగా వస్తాయి.
తెగుళ్ల నివారణ చర్యలు..
గుమ్మడి పెంకు పురుగుల కారణంగా చెట్టు పెరుగుదల మందగిస్తుంది. నివారణకు లీటర్ నీటిలో క్లోరిపైరిపాస్ రెండు మిల్లీలీటర్లు, వేప నూనె 5 మిల్లీ లీటర్ల చొప్పున కలిపి పిచికారీ చేయాలి. రసం పీల్చే పురుగులతో ఆకుల్లోని పత్రహరితం దెబ్బతిని ఆకు ముడతలు ఏర్పడుతాయి. వీటి నివారణకు లీటర్ నీటిలో 1.5 గ్రాముల ఎస్పేట్, పిప్రోనిల్ రెండు మిల్లీ లీటర్లు, ఇమిడా క్లోరిఫైడ్ ఒక మిల్లీ లీటరు చొప్పున కలిపి పిచికారీ చేయాలి. పాము పొడ తెగులుతో మొక్క బలహీనపడుతుంది. దీని నివారణకు లీటరు నీటికి గ్రాము చొప్పున అబామెక్టిస్ మందును కలిపి పిచికారీ చేయాలి. పండు ఈగ సోకితే పంట కోతకొచ్చే సమయంలో కాయలను ధ్వంసం చేస్తుంది. దీంతో కాయలోపలి భాగం కుళ్లిపోయి నాణ్యత తగ్గుతుంది. దీని నివారణకు లీటరు నీటికి ఒక మిల్లీ లీటరు చొప్పున మలథియాన్ మందును కలిపి పిచికారీ చేయాలి. బూడిద తెగులు సోకడం ద్వారా కాయ, ఆకులు పసుపుపచ్చ రంగులోకి మారి పూర్తిగా దెబ్బతింటాయి. దీని నివారణకు లీటరు నీటికి వెటబుల్ సల్ఫర్ను రెండు గ్రాములు లేదా థాపేజ్ 0.4 ఎంఎల్ చొప్పున పిచికారీ చేయాలి.
ఇవి కూడా చదవండి
వైరల్ వీడియో : షోలే పాటకు ఇరాన్ మహిళ స్టెప్పులు
షాకింగ్: పెండ్లికి నిరాకరించాడని ప్రియురాలి తండ్రిని పొట్టనపెట్టుకున్నాడు!