సుప్రీంకోర్టులో చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. సర్వోన్నత న్యాయస్థానం 71 ఏండ్ల చరిత్రలో ఎప్పుడూ లేనివిధంగా 9 మంది న్యాయమూర్తులు ఒకేసారి ప్రమాణం స్వీకరించారు. వారిలో ముగ్గురు మహిళలు ఉండటం విశేషం. ఇది కూడా చరిత్రలో తొలిసారే. ఏడు దశాబ్దాల్లో సుప్రీంకోర్టులో పనిచేసిన మహిళా జడ్జీల సంఖ్య కేవలం ఎనిమిదే. కానీ, ప్రస్తుతం ఒకేసారి కొత్తగా ముగ్గురు మహిళా జడ్జీలు కొలువుదీరారు. దీంతో ప్రస్తుతం మహిళా జడ్జీల సంఖ్య 4కు చేరింది. తాజాగా ప్రమాణం చేసిన జస్టిస్ నాగరత్న 2027లో సుప్రీంకోర్టు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తి అయ్యే అవకాశం ఉన్నది. సుప్రీంకోర్టులో గరిష్ఠంగా 34 మంది జడ్జీలు ఉండవచ్చు. తాజాగా 9 మంది నియామకంతో మొత్తం జడ్జీల సంఖ్య 33కు పెరిగింది.
న్యూఢిల్లీ, ఆగస్టు 31: దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో కొత్త చరిత్ర లిఖితమైంది. మంగళవారం ఒకేసారి 9 మంది కొత్త న్యాయమూర్తులు ప్రమాణ స్వీకారం చేశారు. వారిలో ముగ్గురు మహిళా న్యాయమూర్తులు ఉన్నారు. ఇది సుప్రీంకోర్టు చరిత్రలో తొలిసారి. కొత్త న్యాయమూర్తులతో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ప్రమాణం చేయించారు. దీంతో సుప్రీంకోర్టులో మొత్తం జడ్జిల సంఖ్య 33కు చేరింది. గరిష్ఠంగా 34 మంది జడ్జిలు ఉండవచ్చు. ఇటీవల చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని కొలీజియం సమావేశమై కొత్తగా 9 మంది జడ్జిల నియామకానికి సిఫారసు చేసిన సంగతి తెలిసిందే. దీనికి కేంద్రం ఆమోదం తెలుపడం, ఈ మేరకు రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ నియామక ఉత్తర్వులు జారీ చేశారు. జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ అభయ్ శ్రీనివాస్ ఓకా, జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ జితేంద్ర కుమార్ మహేశ్వరి, జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ సీటీ రవికుమార్, జస్టిస్ ఎంఎం సుందరేశ్, జస్టిస్ బేలా ఎం త్రివేది, సీనియర్ న్యాయవాది, మాజీ అదనపు సొలిసిటర్ జనరల్ పీఎస్ నరసింహ సుప్రీంకోర్టు జడ్జిలుగా ప్రమాణ స్వీకారం చేశారు. వీరిలో జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ పీఎస్ నరసింహ ప్రధాన న్యాయమూర్తులు అయ్యే వరుసలో ఉన్నారు. జస్టిస్ బీవీ నాగరత్న 2027లో జస్టిస్ నాథ్ తర్వాత సీజేఐ అయ్యే అవకాశం ఉంది. అప్పటికి ఆమె పదవీకాలం నెల రోజులు ఉంటుంది. వరుసలో తర్వాత జస్టిస్ నరసింహ ఉన్నారు. ఆయనకు అప్పటికి 6 నెలల పదవీకాలం ఉంటుంది. బార్ నుంచి నేరుగా బెంచ్కి పదోన్నతి పొందిన ఆయన చరిత్రాత్మక అయోధ్య కేసుతో పాటు పలు కీలక కేసులను వాదించారు.
71 ఏండ్లలో 8 మందే మహిళా జడ్జిలు
1950 జనవరి 26న సుప్రీంకోర్టు ఏర్పాటైనప్పటి నుంచి 71 ఏండ్లలో కేవలం 8 మంది మాత్రమే మహిళా న్యాయమూర్తులుగా నియమితులయ్యారు. తాజాగా మంగళవారం ప్రమాణం చేసిన ముగ్గురితో కలిపితే ఆ సంఖ్య 11కు పెరిగింది. తొలి మహిళా న్యాయమూర్తిగా జస్టిస్ ఎం ఫాతిమా బీవీ 1989లో నియమితులయ్యారు. తర్వాత కాలంలో జస్టిస్ సుజాత వీ మనోహర్, జస్టిస్ రుమా పాల్, జస్టిస్ జ్ఞాన సుధా మిశ్రా, జస్టిస్ రంజన పీ దేశాయ్, జస్టిస్ ఆర్ భానుమతి, జస్టిస్ ఇందు మల్హోత్రా, జస్టిస్ ఇందిరా బెనర్జీ మిగతా ఏడుగురు మహిళా జడ్జిలు. ప్రస్తుతం జస్టిస్ ఇందిర పదవిలో కొనసాగుతున్నారు.