బాలాసోర్/హైదరాబాద్, జూలై 21(నమస్తే తెలంగాణ): కొత్త తరం ఆకాశ్ క్షిపణిని(ఆకాశ్-ఎన్జీ) బుధవారం ఒడిశా తీరంలో విజయవంతంగా పరీక్షించారు. మధ్యాహ్నం 12.45 గంటలకు ఈ ప్రయోగం నిర్వహించారు. నిర్దేశించిన లక్ష్యాలను ఆకాశ్ విజయవంతంగా ఛేదించింది. గాల్లోని లక్ష్యాలను ఛేదించేందుకు భూమిపై నుంచి ప్రయోగించడానికి అభివృద్ధి చేసిన క్షిపణి వ్యవస్థ ఇది. ఆకాశ్ క్షిపణిని హైదరాబాద్కు చెందిన డీఆర్డీఎల్ తయారు చేసింది.భారత వాయుసేనకు ఈ క్షిపణి మరింత శక్తినిస్తుందని డీఆర్డీవో చైర్మన్ సతీశ్ రెడ్డి అన్నారు. మరోవైపు, ఆత్మనిర్భర భారత్లో భాగంగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన ‘యుద్ధట్యాంకుల విధ్వంసక క్షిపణి’ని డీఆర్డీవో బుధవారం విజయవంతంగా పరీక్షించింది.