న్యూఢిల్లీ: భారత వాయుసేన (ఐఏఎఫ్)ను బలోపేతం చేసే లక్ష్యంతో రాఫెల్ జెట్ యుద్ధ విమానాల కొనుగోలు (రూ.59 వేల కోట్లు) ఒప్పందంపై ఫ్రాన్స్ జ్యుడీషియల్ దర్యాప్తుకు ఆదేశించడం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి తొలి రియల్ షాక్ కానున్నది.
2016లో 36 దస్సాల్ట్ ఏవియేషన్ నిర్మించిన రాఫెల్ యుద్ధ విమానాలను భారత్కు విక్రయించే ఒప్పందంపై విచారణకు ఫ్రాన్స్ న్యాయమూర్తిని నియమించారు. ఈ న్యాయమూర్తి ఇండిపెండెంట్గా విచారణ జరుపుతారని ఫ్రాన్స్ ఇన్వెస్టిగేటివ్ వెబ్సైట్ మీడియా పార్ట్ తెలిపింది.
రాఫెల్ డీల్లో అవినీతి, ఫేవరెటిజం జరిగిందని అభియోగాలు వచ్చాయి. రెండు దేశాల ప్రభుత్వాల మధ్య జరిగిన ఒప్పందంలో అవకతవకలపై గత నెల 14న విచారణ ప్రారంభమైందని మీడియా పార్ట్ పేర్కొంది.
రాఫెల్ ఒప్పందం ఖరారులో ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండే పాత్రపైనే విచారణ జరుగుతుందని తెలిపింది. ఒప్పందం ఖరారైన సమయంలో హోలండే క్యాబినెట్లో ప్రస్తుత అధ్యక్షుడు ఎమ్మాన్యుయెల్ మాక్రాన్ ఆర్థిక శాఖ మంత్రిగా వ్యవహరించారు.
ఈ ఒప్పందంలో అవినీతి, ఫేవరిటిజం జరిగిందన్న ఆరోపణలపై దర్యాప్తు సాగుతున్నదని ఫ్రాన్స్ పబ్లిక్ ప్రాసిక్యూసన్ సర్వీసెస్ (పీఎన్ఎఫ్) తెలిపింది. 2018లో ఫ్రాన్స్కు చెందిన ఓ స్వచ్ఛంద సంస్థ దాఖలు చేసిన ఫిర్యాదు ఆధారంగా ఈ దర్యాప్తు జరుగుతున్నది. గత ఏప్రిల్ నుంచి ఈ విచారణ పూర్వాపరాలపై మీడియా పార్ట్ వరుసగా కథనాలు ప్రచురిస్తూ వచ్చింది.
అంతకుముందు యూపీఏ ప్రభుత్వ హయాంలో 126 యుద్ధ విమానాలను కొనుగోలు చేయడానికి ఫ్రాన్స్ దస్సాల్ట్తో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ హిందూస్థాన్ ఏరోనాటికల్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్)తో ఒప్పందం కుదుర్చుకున్నది.
యూపీఏ హయాంలో కుదుర్చుకున్న ధర కంటే ఎక్కువకు బీజేపీ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకున్నదని కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ, ఇతర విపక్ష నేతలు ఆరోపించారు. ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలండే స్వయంగా ఈ సంగతి చెప్పారని రాహుల్ అన్నారు.
కనుక రాఫెల్ ఒప్పందం ప్రమాదంలో పడకుండా ఉండాలంటే కేంద్ర సర్కార్ కుదుర్చుకున్న ధర వివరాలు వెల్లడించాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. అయితే, 2019లో దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. రాఫెల్ డీల్లో అవకతవకలు జరిగినట్లు ఆధారాల్లేవని పేర్కొంది.