కోల్కతా: పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీయే మరోసారి భారీ మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నది. మొత్తం 294 స్థానాలకుగాను 292 స్థానాల్లో కౌంటింగ్ జరుగుతుండగా తృణమూల్ ఇప్పటికే 102 స్థానాల్లో విజయం సాధించింది. మరో 110 స్థానాల్లో ఆధిక్యంతో కొనసాగుతున్నది. దాంతో బెంగాల్లో టీఎంసీ హ్యాట్రిక్ విజయం ఖాయమైంది.
ఈ నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సందర్భంగా చోటుచేసుకున్న పరిణామాలను తృణమూల్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత డెరిక్ ఓబ్రియాన్ గుర్తుచేశారు. స్వయంగా ప్రధాని నరేంద్రమోదీ కూడా ప్రచార సభల్లో మమతాబెనర్జీని ఎగతాళి చేసిన విషయాన్ని ప్రస్తావించారు. ఈ మేరకు ఓ ర్యాలీలో మమతాబెనర్జిపై ప్రధాని వ్యంగ్య వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. దానికి మా రాష్ట్రంలోగానీ, మరెక్కడైనాగాని ఇంకెప్పుడూ మహిళను ఎగతాళి చేయకు అని క్యాప్షన్ ఇచ్చారు.