హైదరాబాద్, ఏప్రిల్ 20 (నమస్తే తెలంగాణ): కొవిడ్ నియంత్రణలో భాగంగా రాత్రి కర్ఫ్యూను పకడ్బందీగా అమలుచేయాలని పోలీస్ అధికారులను డీజీపీ ఎం మహేందర్రెడ్డి ఆదేశించారు. జోనల్ ఐజీలు, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలతో ఆయన మంగళవారం వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కర్ఫ్యూ అమలుపై తమ పరిధిలోని వివిధ సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రముఖులతో సమావేశాలు నిర్వహించి చైతన్య పర్చాలని చెప్పారు. కర్ఫ్యూ అమలులో ప్రజలతో దురుసుగా ప్రవర్తించవద్దని, నియమనిబంధనలపై వారికి అవగాహన కల్పించాలని తెలిపారు. గూడ్స్ బండ్లను ఆపొద్దని వెల్లడించారు. ప్రజలు కూడా స్వీయరక్షణ, సమాజ భద్రతకు పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. కర్ఫ్యూ నుంచి మినహాయింపు ఉన్నవాళ్లు గుర్తింపు కార్డులను చూపించాలని ప్రజలకు ఆయన సూచించారు. ఎయిర్పోర్టులు, రైల్వేస్టేషన్లకు వెళ్లేవారు, వచ్చేవాళ్లు ప్రయాణ టిక్కెట్లు తమ వద్దే ఉంచుకొని పోలీసులు ఆపినప్పుడు చూపించాలని అన్నారు. అంతర్రాష్ట్ర సర్వీసులు యధావిధిగా కొనసాగుతాయని డీజీపీ స్పష్టం చేశారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంపై రాష్ట్ర ఎన్నికల సంఘం జారీ చేసే ఆదేశాలను పాటించాలని పోలీస్ సిబ్బందికి సూచించారు. ఈ సందర్భంగా ఆయన పోలీస్ సిబ్బందికి వ్యాక్సినేషన్ పూర్తి చేయించేలా కృషి చేసిన పోలీస్ అధికారులను అభినందించారు. వీడియో కాన్ఫరెన్స్లో అడిషనల్ డీజీలు గోవింద్సింగ్, జితేందర్, ఐజీలు నాగిరెడ్డి, స్టీఫెన్ రవీంద్ర, రాజేశ్కుమార్ పాల్గొన్నారు.
పోలీస్ సిబ్బందికి కొవిడ్ టీకాల ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతున్నది. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో సిబ్బంది అంతా కొవిడ్ వ్యాక్సిన్ తీసుకోవాలని డీజీపీ ఎం మహేందర్రెడ్డి ఇటీవల పోలీస్ అధికారులు, సిబ్బందిని ఆదేశించారు. వారంరోజుల్లో పోలీస్శాఖ స్పెషల్ యూనిట్లు.. టీఎస్ఎస్పీ, ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్, సీఐడీ, ఇంటెలిజెన్స్, గ్రేహౌండ్స్, ఆక్టోపస్ విభాగాల సిబ్బందికి సైతం వ్యాక్సినేషన్ పూర్తిచేయాలని డీజీపీ సూచించారు. దీనిప్రకారం పోలీస్శాఖలోని మొత్తం 80 శాతం మంది సిబ్బందికి మొదటి డోస్ వ్యాక్సినేషన్ పూర్తిచేసినట్టు అధికారులు తెలిపారు. ఇప్పటికే 50శాతం మంది సిబ్బంది రెండో డోస్ను సైతం తీసుకున్నారని వారు పేర్కొన్నారు.