కటక్, సెప్టెంబర్ 25: ప్రజల అవసరాలను తీర్చేలా వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా చట్టాలను చట్టసభలు సంస్కరించాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ సూచించారు. రాజ్యాంగ ఆకాంక్షలను నెరవేర్చేందుకు చట్టసభలు, కార్యనిర్వాహక వర్గం సమన్వయంతో పనిచేయాలని చెప్పారు. అప్పుడు న్యాయవ్యవస్థకు చట్టాలను రూపొందించాల్సిన పని తప్పుతుందని వ్యాఖ్యానించారు. ఒడిశా రాష్ట్ర లీగల్ సర్వీస్ అథారిటీ కొత్త భవనాన్ని సీజేఐ శనివారం ప్రారంభించారు. శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థలు కలిసి పనిచేస్తే ప్రజలకు న్యాయాన్ని అందించడంలో అడ్డంకులను తొలగించగలమని చెప్పారు. స్వాతంత్య్రం వచ్చిన 74 ఏండ్ల తర్వాత కూడా కోర్టును ఆశ్రయించాలంటే సంప్రదాయ, వ్యావసాయిక సమాజాలు జంకుతున్నాయన్నారు. కోర్టుల్లో అనుసరించే పద్ధతులు, భాష వారికి కోర్టులను అన్యమైనవిగా చేస్తున్నాయని చెప్పారు. న్యాయం కోసం వచ్చే వ్యక్తికి తాను ఈ వ్యవస్థకు పరాయివాడినన్న భావన కలుగుతున్నదని తెలిపారు. సామాజిక వాస్తవాలను, ప్రభావాలను పరిగణనలోకి తీసుకోవడంలో భారత న్యాయ వ్యవస్థ తరచూ విఫలమవుతుండటం చేదునిజమని వ్యాఖ్యానించారు. దేశవ్యాప్తంగా వచ్చేవారం నుంచి భారీ స్థాయిలో న్యాయ అవగాహన సదస్సులు నిర్వహిస్తామని తెలిపారు.
పూరీ జగన్నాథస్వామికి సీజేఐ పూజలు
పూరి: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ శనివారం పూరీ జగన్నాథస్వామిని దర్శించుకొని, పూజలు నిర్వహించారు. ఆలయ సముదాయంలో సుమారు 45 నిమిషాలు గడిపిన ఆయన..ఆలయం పరిసరాల్లో శ్రీజగన్నాథస్వామి ఆలయ పాలకవర్గం (ఎస్జీటీఏ) చేపట్టిన సుందరీకరణ పనులను ప్రశంసించారు.
జిల్లా కోర్టుల్లో సాయుధ పోలీసులు
కేంద్రం, రాష్ర్టాలను ఆదేశించాలని సుప్రీంకోర్టులో పిటిషన్
న్యూఢిల్లీ: జిల్లా కోర్టుల్లో తక్షణమే రక్షణ చర్యలు చేపట్టేలా కేంద్రాన్ని, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించాలంటూ సుప్రీంకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. ఢిల్లీలోని రోహిణి కోర్టులో కాల్పులు, గ్యాంగ్స్టర్ హత్య నేపథ్యంలో అడ్వొకేట్ విశాల్ తివారీ ఈ పిటిషన్ను దాఖలు చేశారు. కోర్టుల్లో సీసీటీవీ కెమెరాల ఏర్పాటుతో పాటు సాయుధ పోలీసులను నియమించేలా ఆదేశాలు జారీచేయాలని సుప్రీంకోర్టును కోరారు. గ్యాంగ్స్టర్లను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టు ముందు హాజరుపర్చేందుకు అనుమతించాలని పిటిషన్లో కోరారు. జార్ఖండ్లోని ధన్బాద్ జడ్జి హత్య కేసును ఇప్పటికే సుమోటోగా తీసుకొన్న సుప్రీం ధర్మాసనం.. జడ్జిలు, లాయర్ల రక్షణ, కోర్టులో భద్రత చర్యలపై విచారణ జరుపుతున్నది. తాజా పిటిషన్ను ఈ కేసుతో జత చేసింది.