న్యూఢిల్లీ, జూలై 24: కొత్త వేరియంట్లు పుట్టుకొస్తున్న నేపథ్యంలో బూస్టర్ డోస్ అవసరం పడే అవకాశం ఉన్నదని ఎయిమ్స్ చీఫ్ రణ్దీప్ గులేరియా తెలిపారు. శనివారం ఆయన ఏఎన్ఐ వార్తాసంస్థతో మాట్లాడారు. ‘కొవిడ్ కారణంగా చాలా మందిలో రోగనిరోధక శక్తి క్షీణిస్తున్నది. కొత్త వేరియంట్ల నుంచి రక్షణకు బూస్టర్ డోస్ అవసరం కావొచ్చు. రోగనిరోధక శక్తిని పెంచేలా, అన్ని వేరియంట్ల నుంచి రక్షణ కల్పించేలా రెండో తరం వ్యాక్సిన్లు అందుబాటులోకి రానున్నాయి. అయితే ప్రజలందరికీ వ్యాక్సినేషన్ పూర్తయిన తర్వాతే, బూస్టర్ డోస్ పంపిణీ జరుగుతుంది’ అని ఆయన వివరించారు.
సెప్టెంబర్లో పిల్లలపై కొవాగ్జిన్ ట్రయల్స్ ఫలితాలు
పిల్లలపై కొవాగ్జిన్ టీకా ట్రయల్స్ తుదిదశకు చేరుకున్నాయని, సెప్టెంబర్లో ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉన్నదని గులేరియా తెలిపారు. రాబోయే కొన్ని వారాల్లో లేదా సెప్టెంబర్ నాటికి పిల్లలకు టీకా అందుబాటులోకి వస్తుందని చెప్పారు. కొవాగ్జిన్ను భారత్ బయోటెక్ అభివృద్ధి చేసింది. మరోవైపు, తమ టీకాకు అత్యవసర వినియోగ అనుమతుల కోసం ఇటీవల దరఖాస్తు చేసిన జైడస్ క్యాడిలా సంస్థ.. అందులో పిల్లలపై ట్రయల్స్కు సంబంధించిన డాటాను కూడా సమర్పించిందని గులేరియా తెలిపారు. 12-18 ఏండ్ల పిల్లలపై జైడస్ ట్రయల్స్ నిర్వహించినట్టు పేర్కొన్నారు. ఈ టీకాకు అనుమతులకు మరికొన్ని రోజులు సమయం పట్టొచ్చని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
కోల్డ్స్టోరేజీ అవసరంలేని కొవిడ్ టీకా
కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉన్న టీకాలన్నీ చల్లని ప్రదేశాల్లో నిల్వచేసేవే. ఫైజర్ వంటి కొన్ని సంస్థలు తయారుచేసిన టీకాలైతే మైనస్ 70 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద నిల్వచేయాల్సి ఉంటుంది. దాంతో వీటిని పేద, మధ్యాదాయ దేశాల్లో వినియోగించటం కష్టంగా మారింది. ఈ నేపథ్యంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్కు చెందిన మైన్వాక్స్ సంస్థ రిఫ్రజిరేటర్లో నిల్వచేయాల్సిన అవసరం లేని టీకాను అభివృద్ధి చేయటంపై దృష్టిపెట్టింది. ఐఐఎస్సీ, మైన్వాక్స్ సంయుక్తంగా ‘వెచ్చని’ టీకాను అభివృద్ధి చేశాయి. దీనిపై తదుపరి పరిశోధనల కోసం నిధుల సమీకరణపై దృష్టిపెట్టాయి. తాజాగా ఎక్సెల్ గ్రూప్ నేతృత్వంలో కొన్ని సంస్థలు ఈ టీకాపై పరిశోధన కోసం రూ.31 కోట్ల నిధులు సమకూర్చినట్టు మైన్వాక్స్ ఎగ్జికూటివ్ డైరెక్టర్ గౌతమ్ నాడియా శనివారం వెల్లడించారు. ఈ టీకాను త్వరగా మార్కెట్లోకి తెచ్చేందుకు పెద్దపెద్ద వ్యాక్సిన్ తయారీ సంస్థలతో ఒప్పందాలు చేసుకొనేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. ఈ వ్యాక్సిన్ కరోనా టీకా మార్కెట్లో అనూహ్య మార్పులు తేనున్నదని ఎక్సెల్ సంస్థ ప్రతినిధి మహేంద్రన్ బాలచంద్రన్ వెల్లడించారు.
తగ్గిన వైద్య పరికరాల ధరలు
వైద్య పరికరాల ట్రేడ్ మార్జిన్లపై పరిమితి విధించడంతో సుమారు 620 బ్రాండ్ల ధరలు తగ్గినట్టు కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ తెలిపింది. జాతీయ ఔషధ ధరల నిర్ణాయక సంస్థ (ఎన్పీపీఏ) తన విశేష అధికారాలను ఉపయోగించి పల్స్ ఆక్సీమీటర్, గ్లూకోమీటర్, బీపీ మానిటర్, నెబ్యులైజర్, డిజిటల్ థర్మోమీటర్ల ట్రేడ్ మార్జిన్పై ఈ నెల 13న పరిమితి విధించింది. ఈ ఆదేశాలు ఈ నెల 20 నుంచి అమలులోకి వచ్చాయి. దీంతో విదేశీ, స్వదేశీ సంస్థలకు చెందిన వైద్య పరికరాల ధరలు తగ్గాయని కేంద్రం తెలిపింది.