బీబీపేట్/దోమకొండ/నాగిరెడ్డిపేట్/రామారెడ్డి/ తాడ్వాయి, మే 3: పంచాయతీ పాలకవర్గాలు, గ్రామాభివృద్ధి కమిటీల తీర్మానం మేరకు పలు గ్రామాల్లో స్వచ్ఛంద లాక్డౌన్ కొనసాగుతున్నది. బీబీపేట్ మండల కేంద్రంతోపాటు మాందాపూర్ గ్రామంలో అత్యవసర సేవలు అందించే దవాఖానలు, మెడికల్ షాపులు మినహా దుకాణాలు, హోటళ్లను ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకే తెరిచి ఉంచుతున్నారు. దోమకొండ మండల కేంద్రంలో సోమవారం సైతం సెల్ఫ్ లాక్డౌన్ కొనసాగింది. ప్రజలు ఇండ్ల నుంచి బయటికి రాకపోవడంతో రోడ్లు నిర్మానుష్యంగా మారాయి. కిరాణా, ఇతర దుకాణాలను మధ్యాహ్నం ఒంటి గంటకే మూసేశారు. అత్యవసర పనులు ఉంటేనే ప్రజలు కొవిడ్ నిబంధనలు పాటిస్తూ బయటికి రావాలని పాలకవర్గ సభ్యులు, అధికారులు నిత్యం అవగాహన కల్పిస్తున్నారు.
నాగిరెడ్డిపేట్ మండలకేంద్రంతోపాటు వివిధ గ్రామాల్లో స్వచ్ఛంద లాక్డౌన్ కొనసాగుతున్నది. లాక్డౌన్లో భాగంగా మధ్యాహ్నం రెండు గంటలకే దుకాణాలు మూసివేయడంతో జన సంచారం లేక రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. తాండూర్, ఆత్మకూర్, బొల్లారం గ్రామాల్లో లాక్డౌన్ ప్రశాంతంగా కొనసాగింది. రామారెడ్డి మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ పాలకవర్గం తీర్మానం మేరకు ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకే దుకాణాలు తెరిచి ఉంచారు. అనంతరం ప్రజలెవరూ బయటికి రాకపోవడంతో రోడ్లన్నీ బోసిపోయాయి. తాడ్వాయి మండల పరిధిలోని పలు గ్రామాల్లో స్వచ్ఛంద లాక్డౌన్ కొనసాగుతున్నది. మండల పరిధిలోని దేమికలాన్, బ్రాహ్మణపల్లి, తాడ్వాయి, సంతాయిపేట్ గ్రామాల్లో స్వీయ నిర్బంధం పాటిస్తున్నారు. కరోనా కట్టడికి ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని, పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సర్పంచులు, కార్యదర్శులు అవగాహన కల్పించారు.