ఢిల్లీ: ఐపీఎల్ 14వ సీజన్లో ముంబై ఇండియన్స్ మరో అద్భుత విజయం సాధించింది. చెన్నై సూపర్ కింగ్స్తో చివరి బంతి వరకు ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్లో ముంబై 4 వికెట్లతో గెలుపొందింది. 219 పరుగుల ఛేదనలో ఆల్రౌండర్ పొలార్డ్(87 నాటౌట్: 34 బంతుల్లో 6ఫోర్లు, 8సిక్సర్లు) విధ్వంసం సృష్టించడంతో ముంబై 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. క్వింటన్ డికాక్(38), రోహిత్ శర్మ(35), కృనాల్ పాండ్య(32) రాణించారు. చెన్నై బౌలర్లలో సామ్ కరన్ మూడు వికెట్లు తీయగా శార్దుల్ ఠాకూర్, జడేజా, మొయిన్ అలీ తలో వికెట్ పడగొట్టారు.
అంతకుముందు డుప్లెసిస్(50: 28 బంతుల్లో 2ఫోర్లు, 4సిక్సర్లు), మొయిన్ అలీ(58: 36 బంతుల్లో 5ఫోర్లు, 5సిక్సర్లు), అంబటి రాయుడు(72 నాటౌట్: 27 బంతుల్లో 4ఫోర్లు, 7సిక్సర్లు ) మెరుపు అర్ధశతకాలతో చెలరేగారు. ముంబై బౌలర్లను ధాటిగా ఎదుర్కొంటూ బ్యాట్స్మెన్ సమిష్టిగా రాణించడంతో చెన్నై 20 ఓవర్లలో 4 వికెట్లకు 218 పరుగులు చేసింది.