ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న
ఆదిలాబాద్ రూరల్, మే 3: అత్యవసర సమయాల్లో ప్రైవేట్ దవాఖానల్లో చికిత్స చేయించుకునే పేదలను ఆదుకోవడానికే సీఎంఆర్ఎఫ్ ద్వారా ఆర్థికసాయం మంజూరు చేస్తున్నామని ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సోమవారం 12మందికి సీఎంఆర్ఎఫ్ ద్వారా రూ. 4.25లక్షల విలువైన చెక్కులను పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడారు. ఆదిలాబాద్ ప్రజలు మహారాష్ట్రలో వైద్యం చేయించుకుంటే ఈ పథకం వర్తించదన్నారు. రోజురోజుకూ కరోనా విస్తరిస్తున్నదని, ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో మార్కె ట్ కమిటీ చైర్మన్ మెట్టు ప్రహ్లాద్, కౌన్సిలర్లు బండారి సతీశ్, సంద నర్సింగ్, ఆవుల వెంకన్న, సాయి ప్రణయ్, భరత్, అశోక్ స్వామి, నాయకులు కొండ గణేశ్, గోలి శంకర్, దివ్య పాల్గొన్నారు.
పాడితో రైతులకు ఆదాయం
పాడితో రైతులకు అదనపు ఆదాయం చేకూరుతుందని ఎమ్మెల్యే జోగు రామన్న, రాష్ట్ర డెయిరీ డెవలప్మెంట్ చైర్మన్ లోక భూమారెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని విజయ డెయిరీకి ఆహార భద్రత ప్రమాణ పత్రం మంజూరైందన్నారు. స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విజయ డెయిరీ ఉప సంచాలకుడు మధుసూదన్కు ఆహారభద్రత ప్రమాణ పత్రాన్ని సోమవారం అందించారు. జాదు పటేల్ పాల సంఘానికి రూ.1.50 లక్షల విలువైన బీమా మంజూరు కాగా, లబ్ధిదారులకు అందించారు. కార్యక్రమంలో రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు అడ్డి భోజారెడ్డి, డెయిరీ మేనేజర్ దస్రూ నాయక్, సిబ్బంది పాల్గొన్నారు