సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్లో గుర్తింపు
కొత్త తెలంగాణ చరిత్ర బృందం అన్వేషణ
జగదేవ్పూర్, మే 11: సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండలంలోని పలు గ్రామాల్లో క్రీస్తు పూర్వం 1000- క్రీస్తు శకం 300 నాటివిగా భావిస్తున్న బృహత్ శిలాయుగపు సమాధులు, రెండు శిల్పాలను చరిత్రకారులు కనుగొన్నారు. జంగంరెడ్డిపల్లె, జగదేవ్పూర్, తీగుల్నర్సాపూర్, దౌలాపూర్ గ్రామాల్లో మెగాలిథిక్ సమాధులు గుర్తించినట్టు కొత్త తెలంగాణ చరిత్ర బృందం కన్వీనర్ శ్రీరామోజు హరగోపాల్, సభ్యుడు మచ్చ ప్రణయ్ మంగళవారం తెలిపారు. జగదేవ్పూర్ మండల కేంద్రంలోని అరుదైన బృహత్ శిలాయుగాపు సమాధులు చెక్కుచెదరని స్థితిలో లభించినట్టు వెల్లడించారు. ఈ సమాధులు 133 రాళ్లతో పేర్చి ఉన్నాయని, మొదటి వరుసలో 56 రాళ్లుండగా, రెండో వరుసలో 77 రాళ్లు ఉన్నాయన్నారు. పక్కపక్కనే రెండు వరుసల బంతిరాళ్లుండటం చాలా అరుదైన విషయమని అన్నారు. జగదేవ్పూర్-దౌలాపూర్ శివారు ప్రాంతాల్లో ఒక పెద్ద రాతిగుండుకు ఇరుపక్కల రెండు విగ్రహాలు చెక్కి ఉన్నాయి. ఒకటి గణపతి శిల్పం. చతుర్భుజుడైన మూర్తి చేతుల్లో పరశువు, అంకుశం, ఫలం, కుడుములున్నాయి. ఎడమవైపు తొండం, కుడి భుజం పైనుంచి జంధ్యం అపసవ్యదిశలో ఉండటం విశేషం. మరో విగ్రహం శివునిది. నంది వాహనంగా కనిపిస్తున్న ఈ మూర్తి చతుర్భుజుడు. రెండు శిల్పాలు చెక్కిన స్థానాన్ని బట్టి ఆనాడు తాంత్రికదేవుళ్లుగా పూజించినట్టు తెలుస్తున్నదని చరిత్రకారులు పేర్కొన్నారు.