ముంబై: మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వానికి చెందిన ఎన్సీపీ మంత్రి ఛగన్ భుజ్బల్కు ఊరట లభించింది. ఆయనతోపాటు కుమారుడు, మేనల్లుడు మరో ఐదుగురిని మహారాష్ట్ర సదన్ స్కామ్ కేసు నుంచి ఏసీబీ ప్రత్యేక కోర్టు గురువారం డిశ్చార్జ్ చేసింది. 2005-06లో పీడబ్ల్యూడీ మంత్రిగా ఉన్న ఛగన్ భుజ్బుల్, ఆయన కుటుంబ సభ్యులపై అవినీతి ఆరోపణలు వచ్చాయి. ఢిల్లీలో మహారాష్ట్ర సదన్ నిర్మాణం కాంట్రాక్ట్ దక్కించుకున్న కేఎస్ చామంకర్ ఎంటర్ప్రైజెస్ నుంచి ఆయనకు, కుటుంబ సభ్యులకు రూ.800 కోట్ల ముడుపులు ముట్టినట్లు ఏసీబీ ఆరోపించింది. మహారాష్ట్ర సదన్ స్కామ్పై కేసు నమోదు చేసి 2016లో ఛార్జ్షీట్ దాఖలు చేసింది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఆ కేటగిరి కాంట్రాక్టర్ 20 శాతం లాభం పొందాల్సి ఉండగా 80 శాతం లాభం సంపాదించినట్లు ఏసీబీ ఆరోపించింది.
కాగా, ఛగన్ భుజబల్, ఆయన కటుంబం తరుఫున న్యాయవాదులు ప్రసాద్ ధకేఫాల్కర్, సాజల్ యాదవ్, సుదర్శన్ ఖవాసే కోర్టులో వాదించారు. అవన్నీ తప్పుడు ఆరోపణలని, తప్పుడు లెక్కల అంచనాలు, ఊహల ఆధారంగా కేసు నమోదు చేశారని తెలిపారు. 2016లో వేలాది పేజీలతో భారీ ఛార్జ్షీట్ దాఖలు చేసినప్పటికీ విచారణ కొనసాగించడానికి తగిన ఆధారాలు లేవని డిశ్చార్జ్ పిటిషన్లో పేర్కొన్నారు. దీనిపై విచారణ జరిపిన ముంబై ఏసీబీ ప్రత్యేక కోర్టు తగిన ఆధారాలు లేనందున ఛగన్ భుజబల్, ఆయన కుమారుడు పంకజ్, మేనల్లుడు సమీర్తోపాటు మరో ఐదుగురిని ఈ కేసు నుంచి డిశ్చార్జ్ చేసింది.
మరోవైపు ఈ కేసు నుంచి బయటపడటంపై మంత్రి ఛగన్ భుజ్బల్ సంతోషం వ్యక్తం చేశారు. ఢిల్లీలో మహారాష్ట్ర సదన్ నిర్మాణానికి ఆ కాంట్రాక్టర్కు డబ్బులు ఇవ్వలేదు లేదా భూమిని కేటాయించలేదని ఆయన తెలిపారు. కేబినెట్ కమిటీ రూ.100 కోట్లు ఇచ్చిందని, తాను రూ.800 కోట్ల స్కామ్ చేశానని ఏసీబీ ఆరోపిందని చెప్పారు. అయితే దీనికి సంబంధించి ఎలాంటి ఆధారాలు లేవన్న భుజ్బల్, పార్టీ తనకు మద్దతుగా నిలిచిందని అన్నారు. పోలీసులు తన కుమారుడితోపాటు కుటుంబాన్ని టార్గెట్ చేసి వేధించారని ఆయన విమర్శించారు.
ఈ కేసు హైకోర్టుకు లేదా సుప్రీంకోర్టుకు వెళ్లవచ్చని ఛగన్ భుజ్బల్ అన్నారు. అయితే కేసులో ఎలాంటి ఆధారాలు లేవని ఏసీబీ పత్ర్యేక కోర్టు అంగీకరించి తనను కేసు నుంచి డిశ్చార్జ్ చేసిందని వెల్లడించారు. మరోవైపు ఎన్సీపీ మంత్రి ఛగన్ భుజ్బల్కు కోర్టు క్లీన్ చిట్ ఇవ్వడంతో ఆ పార్టీ కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. చిందులేసి సంబరాలు జరుపుకున్నారు.