న్యూఢిల్లీ : పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు రెండు రోజుల ముందు ప్రధాని నరేంద్ర మోదీతో ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ భేటీపై వెల్లడైన ఊహాగానాలకు ఎన్సీపీ తెరదించింది. ఈ సమావేశానికి ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదని తేల్చిచెప్పింది. ఎన్సీపీ, బీజేపీలు నదికి ఇరువైపులా ఉండే ఒడ్డు వంటివని ఈ రెండు పార్టీలు నదిలో నీరు ఉన్నంతవరకూ కలపబోవని ఎన్సీపీ నేత, మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ పేర్కొన్నారు. సైద్ధాంతికంగా, రాజకీయంగా బీజేపీ, ఎన్సీపీలు పూర్తిగా భిన్నమైనవని స్పష్టం చేశారు.
శరద్ పవార్ గత రెండురోజులుగా ఢిల్లీలో ఉన్నారని, రాజ్యసభ నేత పీయూష్ గోయల్ ఆయనతో సమావేశమయ్యారని, రక్షణ మంత్రి రాజ్నాధ్ సింగ్తోనూ పవార్ చర్చలు జరిపారని చెప్పారు. మహారాష్ట్ర విపక్ష నేతలతో పవార్ సంప్రదింపులు జరుపుతున్నారని వచ్చిన వార్తలను నవాబ్ మాలిక్ తోసిపుచ్చారు. మహారాష్ట్రలో ఎన్సీపీ, శివసేన, కాంగ్రెస్తో కూడిన సంకీర్ణ సర్కార్లో లుకలుకల నేపథ్యంలో ప్రధాని మోదీతో ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ భేటీ రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది.