న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కాన్పూర్ జిల్లా మహరాజ్పూర్ పట్టణంలో ఓ పెండ్లి వేదికను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. సన్నాయి పాటలు, డీజే చప్పుళ్లతో పెండ్లి మండపం అంతా హడావిడిగా ఉన్నది. వధూవరుల తరఫు బంధువుల రాకతో ఫంక్షన్ హాల్ అంతా కళకళలాడుతున్నది. పెండ్లి కొడుకు, పెండ్లి కూతురు వేదికపైకి వచ్చారు. తాళీ కట్టే సమయం రానే వచ్చింది. కానీ, పెండ్లి కూతురు మెడలో వరుడికి బదులుగా గెస్టుగా వచ్చిన మరో వ్యక్తి తాళి కట్టాడు.
సీని ఫక్కీలో జరిగిన ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే.. పెండ్లి కొడుకుకు ఆ పెండ్లి ఇష్టం లేదు. కానీ తల్లిదండ్రులకు ఆ విషయం చెప్పలేకపోయాడు. అందుకే వేదిక మీదకు వచ్చి పీటలపై కూర్చున్నాడు. వధూవరులు దండలు కూడా మార్చుకున్నారు. తీరా తాళి కట్టే సమయానికి పెండ్లి కొడుకు మాయమయ్యాడు. కాసేపు అతని కోసం వెతికిన ఇరు కుటుంబాలవారు పెండ్లి ఇష్టం లేకనే అతను పారిపోయినట్లు తెలుసుకున్నారు.
వరుడు పారిపోయి వధువు ఒక్కతే పెండ్లి పీటలపై ఉండటాన్ని వధువు తరఫు బంధువులు అవమానంగా భావించారు. అందుకే ఇంతదాకా వచ్చిన పెండ్లిని ఆపకూడదనే ఉద్దేశంతో పెండ్లికి వచ్చిన అతిథుల్లో ఎవరైనా వధువును చేసుకునేందుకు సుముఖంగా ఉన్నారా అని ఆరా తీశారు. దాంతో ఓ వ్యక్తి పెండ్లి చేసుకునేందుకు ఒప్పుకున్నాడు. దాంతో ఇరుకుటుంబాల వారు మాట్లాడుకుని అదే వేదికపై పెండ్లి జరిపించారు.