కొమురంభీం ఆసిఫాబాద్ : వన్యప్రాణి చట్టం అదేవిధంగా పోలీసులను గాయపరిచినందుకుగాను సిర్పూర్ (టీ) అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన పలువురు బీజేపీ నాయకులతో పాటు మరో 20 మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఏప్రిల్ 9న కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్పేట మండలం కొండపల్లి గ్రామంలో పోడు రైతులకు మద్దతుగా చేపట్టిన నిరసన కార్యక్రమం సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకుంది.
నిందితులు బీజేపీకి చెందిన డాక్టర్ పి. హరీష్ రావు, గొల్లపల్లి వీరభద్ర చారీ, కొండపల్లి నివాసితులు 20 మంది, బెజ్జూర్ లోని రెబ్బెనా గ్రామానికి చెందిన ఎనిమిది మంది అని ఆసిఫాబాద్ అదనపు పోలీసు సూపరింటెండెంట్ ఒక ప్రకటనలో తెలిపారు. నిందితులను సిర్పూర్ (టీ) పట్టణంలోని కోర్టు ముందు హాజరుపరిచి జ్యుడీషియల్ రిమాండ్కు తరలించినట్లు పేర్కొన్నారు. అటవీ భూములను ఆక్రమించుకోవడం, పోలీసు వాహనాలను ధ్వంసం చేయడం, అదేవిధంగా ఐదుగురు కానిస్టేబుళ్లను గాయపరిచినందుకు వీరిపై కేసు నమోదైనట్లు చెప్పారు.