రాయ్పూర్ : ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లాలో సీఆర్పీఎఫ్ క్యాంప్పై సోమవారం సాయంత్రం ఆకస్మిక దాడి చేశారు. పామేడు పోలీస్ స్టేషన్ పరిధిలోని ధర్మారం 196వ బెటాలియన్ క్యాంపుపై మావోయిస్టులు దాడికి ప్రయత్నించగా.. వెంటనే తేరుకున్న భద్రతా బలగాలు దాడిని తిప్పికొట్టాయి. ఇరువర్గాల మధ్య సుమారు అరగంటకుపైగా కాల్పులు జరిగినట్లు సమాచారం. బలగాల ధాటికి తట్టుకోలేక మావోయిస్టులు తప్పించుకొని పోయినట్లు తెలుస్తోంది. ఎదురుకాల్పులను బీజాపూర్ ఏఎస్పీ పంకజ్ శుక్లా ధ్రువీకరించారు. కాల్పుల శబ్దం పామేడ్ గ్రామం వరకు వినిపించడంతో పరిసర గ్రామాల ప్రజలు భయాందోళనకు గురయ్యారు.
అయితే, ఇప్పటి వరకు ఇరువైపులా ఎలాంటి ప్రాణనష్టం జరుగలేదు. ఇదిలా ఉండగా.. కాల్పులు జరిగిన ప్రాంతంలో రోడ్డు నిర్మాణం జరుగుతోంది. ఈ నిర్మాణాన్ని మావోలు వ్యతిరేకిస్తున్నారు. ఈ ప్రాంతం మావోయిస్టులు నియంత్రణలో ఉంటోంది. సీఆర్పీఎఫ్ బలగాలు సైతం ఇటీవల కొత్తగా క్యాంప్ ఏర్పాటు చేశాయి. దీంతో రూ.కోట్లాది విలువైన వంతెన, రోడ్డు నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. తెలంగాణను కలుపుతూ.. బీజాపూర్ నుంచి పామేడ్, బసగూడ మీదుగా రోడ్డు నిర్మిస్తున్నారు.