న్యూఢిల్లీ : ముంబై నుంచి గోవా వెళుతున్న క్రూయిజ్లో జరిగిన రేవ్ పార్టీపై ఎన్సీబీ అధికారుల దాడులు ముందస్తు ప్లాన్తోనే జరిగాయని ఎన్సీపీ నేత, మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ ఆరోపించారు. డ్రగ్స్ పార్టీపై దాడుల నేపధ్యంలో కాషాయ పార్టీ నేతలు, ఎన్సీబీ అధికారి సమీర్ వాంఖడే మధ్య సంప్రదింపులు జరిగి ఉంటాయని వ్యాఖ్యానించారు. ఈ పార్టీలో పట్టుబడ్డ సీనియర్ బీజేపీ నేత కుటుంబసభ్యుడుతో పాటు ముగ్గురు నిర్బంధితులను ఎన్సీబీ విడుదల చేసిందని అన్నారు.
రేవ్ పార్టీలో 11 మందిని అరెస్ట్ చేయగా క్రూయిజ్ షిప్పై దాడుల అనంతరం సమీర్ వాంఖడే 8 నుంచి 10 మందిని అదుపులోకి తీసుకున్నామని చెప్పారని మాలిక్ గుర్తుచేశారు. ఆపై రిషబ్ సచ్దేవ, ప్రతీక్ గాబా, అమీర్ ఫర్నిచ్వాలా అనే ముగ్గురిని విడుదల చేశారని అన్నారు. క్రూయిజ్ షిప్పై దాడుల్లో 11 మంది పట్టుబడితే ఎవరి ఆదేశాలపై ముగ్గురు నిందితులను వదిలివేశారో చెప్పాలని ఎన్సీబీని తాము డిమాండ్ చేస్తున్నామని చెప్పారు. ఈ అంశంపై ముంబై పోలీసుల యాంటీ నార్కోటిక్స్ సెల్చే స్వతంత్ర దర్యాప్తు చేపట్టాలని కోరుతూ తాను సీఎం ఉద్ధవ్ ఠాక్రేకు లేఖ రాస్తానని తెలిపారు.