చండీగఢ్: పంజాబ్కు చెందిన కాంగ్రెస్ అసంతృప్త నేత నవజోత్ సింగ్ సిద్ధు మరోసారి ఢిల్లీ బాట పట్టారు. పార్టీ అధిష్ఠానానికి చెందిన రాహుల్, ప్రియాంక గాంధీలతో మంగళవారం ఆయన భేటీ కానున్నారు. 2019లో మంత్రి పదవిని వీడిన నాటి నుంచి సీఎం అమరీందర్ సింగ్ తీరుపై ఆయన మండిపడుతున్నారు. కేబినెట్ రీషఫుల్లో సిద్ధూకు విద్యుత్ శాఖ మంత్రి పదవి ఇచ్చినా బాధ్యతలు చేపట్టలేదు. తాజాగా పంజాబ్ కాంగ్రెస్లో అసంతృప్త జ్వాలలు మరింతగా రేగుతున్నాయి. ఈ నేపథ్యంలో పార్టీ పరిస్థితిని చక్కదిద్దేందుకు మల్లిఖార్జున ఖర్గే నేతృత్వంలో ముగ్గురు సభ్యులతో ఒక కమిటీని కాంగ్రెస్ నియమించింది. ఇటీవల ఢిల్లీ వెళ్లిన సీఎం అమరీందర్ సింగ్ కమిటీ సభ్యులను కలిశారు. అయితే కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా, రాహుల్ను ఆయన కలువలేదు. వచ్చే ఏడాది పంజాబ్ రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో సిద్ధు ఢిల్లీకి వెళ్లి రాహుల్, ప్రియాంక గాంధీలతో భేటీ కానుండటం ప్రాధాన్యం సంతరించుకున్నది.