భువనేశ్వర్ : యాస్ తుఫాన్ బీభత్సంతో వాటిల్లిన నష్టాన్ని సొంత వనరులతోనే అధిగమిస్తామని కేంద్రాన్ని ఎలాంటి తక్షణ సాయం కోరబోమని ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్ పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం కొవిడ్-19 మహమ్మారి కట్టడి భారంతో సతమతమవుతున్నందున తాము తమ సొంత వనరులతోనే తుఫాన్ కష్టనష్టాలను అధిగమిస్తామని ఆయన తెలిపారు. భువనేశ్వర్ లో తుఫాన్ ప్రభావంపై నిర్వహించిన సమీక్షా సమావేశంలోనూ నవీన్ పట్నాయక్ ఎలాంటి రిలీఫ్ ప్యాకేజ్ ను కోరలేదు.
ఒడిషాను విపత్తులు ఎదుర్కొనేలా దీటైన మౌలిక సదుపాయాలు మెరుగుపరిచేందుకు దీర్ఘకాలిక లక్ష్యంతో సాయాన్ని కోరతామని పట్నాయక్ ట్వీట్ చేశారు. యాస్ తుఫాన్ తో ఒడిషాలో వాటిల్లిన తీవ్ర నష్టం గురించి ప్రధాని మోదీకి పట్నాయక్ వివరించారు. ఇక బెంగాల్, ఒడిషా రాష్ట్రాల్లో తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ప్రధాని మోదీ శనివారం ఏరియల్ సర్వే చేపట్టారు.