భాస్కర రామాయణాన్ని నలుగురు కవులు రచించారు. భాస్కరుని కుమారుడైన మల్లికార్జునభట్టు- బాల, కిష్కింధ, సుందరకాండలను రచించాడు. భాస్కరుని శిష్యుడు రుద్రదేవుడు- ‘అయోధ్యకాండ’ను, భాస్కతొలి రామాయణం మనదే!రుడు ‘అరణ్యకాండ’ను రచించాడు. భాస్కరుడు ‘యుద్ధకాండ’ను తీసుకొని రచిస్తుండగా, అతని స్నేహితుడు అయ్యలార్యుడు అతని అనుమతితో యుద్ధకాండ ఉత్తరభాగాన్ని రచించాడు. వాళ్లలో భాస్కరుడు వృద్ధుడు కావడం వల్లనో లేదా శిష్యులకు అవకాశం ఇవ్వడానికో లేదా తొందరగా ముగించాలనో..తన కుమారుడు, శిష్యుడు, స్నేహితుడు.. ముగ్గురు కవులకు రచించే అవకాశం ఇచ్చాడు.
భాస్కరుడు రెండవ ప్రతాపరుద్రుని కాలం (13వ శతాబ్దంలో) ఉన్నాడు. ఈ కావ్యాన్ని ప్రతాపరుద్రుని అశ్వసేనాధ్యక్షుడైన ‘సాహిణి మారన’కు అంకితంగా ఇచ్చాడు. ‘సోమదేవ రాజీయా’న్ని బట్టి భాస్కరుడు రెండవ ప్రతాపరుద్రుని కాలం వాడని రూఢీగా తెలుస్తున్నది. ఢిల్లీ సుల్తాన్ల దండయాత్రలతో అల్లకల్లోలంగా ఉన్న ఓరుగల్లులో ఈ రామాయణాన్ని పూర్తిచేయాలని కావచ్చును, భాస్కరుడు తన శిష్యులను రచించమని ప్రోత్సహించి ఉంటాడు. అప్పుడు భాస్కరుడు క్రీ.శ.14వ శతాబ్దం ఆరంభంలో ఈ కావ్యాన్ని పూర్తిచేసి సాహిణి మారనకు అంకితంగా ఇచ్చి ఉంటాడు.
‘భాస్కర రామాయణం’ రచించిన కవుల్లో భాస్కరుని పేరు ప్రధానంగా వినిపిస్తున్నా ఎక్కువ భాగాన్ని రచించింది అతని కొడుకు మల్లికార్జునభట్టు. అతని కవిత్వం సంస్కృత పదాలతో రసవంతంగా నడిచింది. ఆ కవి ‘బాలకాండ’ను ప్రబంధ మార్గంలో అయోధ్యానగర వర్ణనతో ఆరంభించాడు. తర్వాత మొల్ల కవయిత్రి తన రామాయణాన్ని అయోధ్యా నగర వర్ణనతోనే ఆరంభించింది.
మల్లికార్జునుని కవిత్వం శబ్దాలంకారాలతో రమ్యంగా నడిచింది. రుద్రదేవుడు అంటే.. రెండవ ప్రతాపరుద్ర దేవుడే అని అంటారు. తెలుగులో అతని ఈ ఒక్క రచనే కనిపిస్తున్నది. అతని కవిత్వం సులభ శైలిలో సంగ్రహంగా నడిచింది. వర్ణనలు లేకుండా కథ చెప్పడమే ప్రధానంగా ఉంది. భాస్కరుని కవిత్వం రమణీయంగా ఉంది. అయ్యలార్యుడు భాస్కరుని కవిత్వాన్ని అనుసరిస్తూ రచించాడు. అందుకేనేమో.. కొందరు భాస్కరుడు మరణించటం చేత ‘యుద్ధకాండం’లో మిగిలిన భాగాన్ని అయ్యలార్యుడు రచించి పూరించాడని అంటారు.
భాస్కర రామాయణం చంపూ మార్గంలో రచించబడింది. గద్యం, పద్యాలు ధారాళంగా, ప్రసన్నంగా ఉన్నాయి. అలంకారాలతో భాస్కర రామాయణం రసవంతంగా సులభశైలిలో ఉంది. నలుగురు కవులు రచించినా ఈ రామాయణం అతుకుల బొంతగా లేకుండా ఏకసూత్రతతో నడిచింది. భాస్కర రామాయణం.. వాల్మీకి రామాయణాన్ని అనుసరిస్తూ రచింపబడింది. అయినా నాటి దేశీయతా ప్రభావం వల్లనో ఏమో భాస్కరుడు వాల్మీకి చెప్పని ప్రజా వ్యాప్తిలో ఉన్న వృత్తాంతాలను ఆ కావ్యంలో చేర్చాడు. ఉదాహరణకు.. ఇంద్రుడు కోడియై కూయటం, అహల్య రాయిగా శపించబడటం, జంబుమాలి- కాలనేమి వృత్తాంతాలు, రావణుని నాభిలో అమృత కలశం ఉన్నదన్న రహస్యాన్ని విభీషణుడు రామునికి చెప్పటం.. వంటి సన్నివేశాలు ఈ రామాయణంలో చోటుచేసుకున్నాయి.
భాస్కర రామాయణం, ఎర్రన రామాయణం కన్నా ముందు రచింపబడిందని చెప్పాలి. మహమ్మదీయుల దండయాత్రలతో కాకతీయుల విధ్వంసం జరగకముందే భాస్కరుడు ‘రామాయణం’ను రచించి సాహిణి మారనకు అంకితం ఇచ్చాడు. సాహిణి మారన ప్రతాపరుద్రుని అశ్వసేనాధ్యక్షుడు కాబట్టి భాస్కర రామాయణం ఎర్రన రామాయణం కన్నా ముందే రచింపబడిందని చెప్పొచ్చు. భాస్కర రామాయణం కన్నా ముందు తెలుగులో గోనబుద్ధారెడ్డి ‘రామాయణం’ను రచించాడు. ఆ తర్వాత కవయిత్రి మొల్ల రామాయణాన్ని రచించింది. అంతకుముందు కొఱవి గోపరాజు తాత అయిన కొఱవి సత్యనారాయణ (14వ శతాబ్దం ఆరంభం) రామాయణాన్ని రచించాడు. ఈ విధంగా ఇతర ప్రాంతాల నుంచి రామాయణం రాకముందే, తెలంగాణ నుంచి నాలుగు రామాయణాలు రచింపబడినాయి. వీటిల్లో కొఱవి సత్యనారాయణ రచించిన ఒక రామాయణం లభించలేదు.
ముదిగంటి సుజాతారెడ్డి, 99634 31606