హైదరాబాద్ : సికింద్రాబాద్లోని గాంధీ దావఖాన.. ఇప్పుడో కోవిడ్ సెంటర్. మహ్మమ్మారి బారిన పడ్డవారికి అదే కీలక చికిత్సాలయం. ఆ ఆలయాన్ని ఇవాళ సీఎం కేసీఆర్ సందర్శించారు. దాదాపు గంట సేపు గాంధీ హాస్పిటల్లో ఆయన గడిపారు. కరోనా వైరస్ సోకిన రోగులు చికిత్స పొందుతున్న వార్డుల్లో కేసీఆర్ పర్యటించారు. మెరుపు దాడి చేసిన కరోనా నుంచి కోలుకుంటున్నవారిని ఆయన పలుకరించారు. కరోనా ఎమర్జెన్సీ వార్డులో ఉన్న పేషెంట్లతో సీఎం కేసీఆర్ మాట్లాడారు. వారి వారి బంధువులతోనూ ఆయన ముచ్చటించారు. అక్కడ ఉన్న సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. చికిత్స ఎలా అందుతోంది.. ఇంకేం కావాలన్న అభిప్రాయాలను ఆయన తెలుసుకున్నారు. కరోనా రోగుల మనసు కుదుటపడేలా .. కేసీఆర్ వారిని పరామర్శించారు. వారిలో ధైర్యాన్ని నింపారు. చికిత్స అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్న భరోసా ఇచ్చారు.
ఔట్ పేషెంట్ వార్డులో కూడా సీఎం కేసీఆర్ కలియతిరిగారు. అక్కడ కోవిడ్ చికిత్స పొందుతున్నవారిని .. వైద్యం గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కరోనా రోగులకు మనోధైర్యమే మందు. ఆ ధైర్యాన్ని రోగుల్లో నింపే ప్రయత్నం చేశారు కేసీఆర్. ప్రతి ఒక పేషెంట్ను పలుకరిస్తూ..వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపారు. ఔషధాలే కాదు.. నమ్మకమైన మాట కూడా వైద్యానికి కీలకమన్న సందేశాన్ని ఆయన వినిపించారు. రాష్ట్ర ప్రజల ఆరోగ్య సంక్షేమ గురించి ప్రభుత్వం పట్టింపుతో ఉందన్న సంకేతాలను సీఎం కేసీఆర్ తన పర్యటన ద్వారా తెలిపారు.
కేవలం రోగులను పలుకరిచడమే కాదు.. గాంధీ హాస్పిటల్లో పనిచేస్తున్న వైద్య సిబ్బంది, జూనియర్ డాక్టర్లతోనూ సీఎం కేసీఆర్ మాట్లాడారు. వారికి కూడా ఆయన బలమైన నమ్మకాన్ని ఇచ్చారు. ఆక్సిజన్, ఔషధాల కొరత రాకుండా చూడాలన్నారు. విపత్కర సమయంలో వైద్యం అందిస్తున్న డాక్టర్లను సీఎం కేసీఆర్ అభినందించారు. రాష్ట్ర ప్రజలకు ముఖ్యమైన ప్రభుత్వ ఆస్పత్రిగా నిలిచిన గాంధీ హాస్పిటల్ను మరింత ఆధునీకరించేందుకు కేసీఆర్ పట్టుదలతో ఉన్నట్లు తెలుస్తోంది.