గజ్వేల్ రూరల్/తొగుట, ఏప్రిల్ 4 : మల్లన్నసాగర్ ప్రాజెక్టులో ముంపునకు గురైన సిద్దిపేట జిల్లా తొగుట మండలం వేములఘాట్, పల్లెపహాడ్ గ్రామాలకు చెందిన 151 కుటుంబాలు ఆదివారం సంబురంగా కొత్త ఇండ్లలో పూజలు చేసి, పాలు పొంగించారు. ఆదివారం మంచి రోజు కావడంతో సంతోషంతో ఇంటి ఆడపడచులతో కడపలు కడిగించి ఇంట్లోకి అడుగుపెట్టారు. గజ్వేల్లోని ఆర్అండ్ఆర్ కాలనీలోకి ఒకేరోజు రెండు గ్రామాల ప్రజలు సంతోషంతో అడుగుపెట్టడంతో కొత్త వాతావరణం కనిపించింది. గజ్వేల్ పట్టణ సమీపంలోని ముట్రాజ్పల్లి వద్ద నిర్మించిన ఆర్అండ్ఆర్ కాలనీలో వేములఘాట్కు చెందిన 116 కుటుంబాలు, పల్లెపహాడ్కు చెందిన 35 కుటుంబాలకు డబుల్ బెడ్రూం ఇండ్లను అధికారులు కేటాయించగా, ఆదివారం 151 కుటుంబాల వారు కొత్త ఇండ్లలోకి ప్రవేశించారు. మల్లన్నసాగర్ ప్రాజెక్టు పనులు వేగవంతంగా జరుగుతుండడంతో త్వరితగతిన ఇండ్ల నిర్మాణం పూర్తి చేసి అధికారులు లబ్ధిదారులకు అందజేశారు. నూతన ఇండ్ల గృహ ప్రవేశాల్లో జిల్లా పంచాయతీ అధికారి సురేశ్బాబు, ఆర్డీవో అనంతరెడ్డి, తాసిల్దార్ ఆరీఫా, బాల్రెడ్డి పాల్గొన్నారు. అధికారులు నేరుగా వెళ్లి ఇంటి యజమానులకు మిఠాయిలు తినిపించారు.
ఖాళీ అవుతున్న ముంపు గ్రామాలు
మల్లన్నసాగర్ ముంపు గ్రామాల ప్రజలు ఇండ్లను ఖాళీ చేసి గజ్వేల్ సమీపంలోని ముట్రాజ్పల్లి, సంగాపూర్లో ఏర్పాటుచేసిన డబుల్ బెడ్రూం ఇండ్ల్లలోకి వెళ్తున్నారు. ఇప్పటికే రాంపూర్, లక్ష్మాపూర్ గ్రామస్థులు పూర్తిస్థాయిలో గ్రామాలను ఖాళీచేసి సంగాపూర్లోని డబుల్ బెడ్రూం కాలనీ, వాగ్గడ్డ వద్ద స్థిరపడ్డారు. తొగుట మండలంలోని ఏటిగడ్డ కిష్టాపూర్లో 25 మంది, వేములఘాట్లో 116, పల్లెపహాడ్లో 100 మంది ఇండ్లను ఖాళీ చేసి ముట్రాజ్పల్లిలోని డబుల్ బెడ్రూం ఇండ్లలోకి వెళ్లారు. ముంపు గ్రామస్థులు ఎంతో సహకారం అందిస్తున్నారని, మిగతా వారు కూడా ఇండ్లు ఖాళీ చేసి గజ్వేల్కు రావడానికి సిద్ధ్దంగా ఉన్నారని ఆర్డీవో అనంతరెడ్డి తెలిపారు. ముంపు గ్రామస్థులకు న్యాయబద్ధంగా రావాల్సిన పరిహారం అందిస్తున్నామని చెప్పారు. ఎవరికైనా అందకపోతే న్యాయం చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.
ఇవీ కూడా చదవండి…
చిట్టి బుర్రల గట్టి ఆవిష్కరణలు