పట్నా: ఎన్డీఏ కూటమి తరఫున ప్రస్తుతం నరేంద్రమోదీనే ప్రధానిగా ఉన్నారని, వచ్చే ఎన్నికల్లో ప్రధాని అభ్యర్థిగా కూడా నరేంద్రమోదీనే ఉంటారని జేడీయూ జనరల్ సెక్రెటరీ కేసీ త్యాగి ( KC Tyagi ) వ్యాఖ్యానించారు. ప్రధాని పదవికి బీహార్ సీఎం నితీశ్కుమార్ అన్ని విధాలుగా తగిన వాడని నిన్న (ఆదివారం) త్యాగి వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో ఇవాళ పట్నాలో మీడియా ఆయనను పలుకరించగా పైవిధంగా స్పందించారు.
ఆదివారం మీడియాతో మాట్లాడిన కేసీ త్యాగి.. నితీశ్ కుమార్ ప్రధాని పదవికి అన్ని విధాలుగా తగిన వ్యక్తని చెప్పారు. ఆయనకు 16 ఏండ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్నదన్నారు. కేంద్రమంత్రిగా కూడా ఆయనకు ఉన్నదని గుర్తుచేశారు. నితీశ్ కుమార్ పనితీరు గురించి దేశంలో అందరికీ తెలుసని పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం ప్రధాని పదవి ఖాళీగా లేదని త్యాగి వ్యాఖ్యానించారు.