గోకల్దాస్ కంపెనీ రాష్ట్రంలో పెట్టుబడులు పెడుతున్నట్టు ప్రకటించటం సంతోషకరం. టెక్స్టైల్ రంగాన్ని రాష్ట్రప్రభుత్వం ఇప్పటికే ప్రాధాన్యత రంగాల్లో చేర్చి అనేక కార్యక్రమాలు చేపడుతున్నది. రాష్ట్రంలో టెక్స్టైల్ పరిశ్రమలో ఇప్పటిదాకా వస్ర్తాల తయారీ యూనిట్లే ఉన్నాయి. గోకల్దాస్ కంపెనీ రాకతో రెడీ టు వేర్/ రెడీమేడ్ గార్మెంట్స్ పరిశ్రమ ప్రస్థానం ప్రారంభమైంది. ఈ కంపెనీ స్ఫూర్తితో రాష్ట్రంలోకి మరిన్ని అప్పారెల్ కంపెనీలు వస్తాయని ఆశిస్తున్నాను.
– మంత్రి కేటీఆర్
ప్రత్యేక ప్రతినిధి, ఏప్రిల్ 9 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు మరో ప్రముఖ టెక్స్టైల్ కంపెనీ ముందుకొచ్చింది. దేశంలో రెడీమేడ్ వస్ర్తాల తయారీలో పేరుగాంచిన గోకల్దాస్ కంపెనీ తెలంగాణలో కార్యకలాపాలను ప్రారంభించాలని నిర్ణయించింది. ప్రగతిభవన్లో మున్సిపల్, పరిశ్రమలు, ఐటీశాఖమంత్రి కే తారకరామారావు సమక్షంలో పరిశ్రమలు, ఐటీశాఖ ఉన్నతాధికారులతో గోకల్దాస్ కంపెనీ శుక్రవారం అవగాహన ఒప్పందం కుదుర్చుకొన్నది. సిరిసిల్ల సమీపంలోని పొద్దూరు గ్రామంలో సుమారు 65 ఎకరాల్లో ఏర్పాటుచేయనున్న అప్పారెల్ పార్కులో ఈ కంపెనీ కార్యకలాపాలు కొనసాగించనున్నది. ఇప్పటికే ఈ పార్కులో మౌలిక వసతుల కల్పన పూర్తయింది. పార్కు సిద్ధమైన తర్వాత సిరిసిల్ల కేంద్రంగా పవర్లూమ్ పరిశ్రమతోపాటు మొత్తం టెక్స్టైల్ అప్పారెల్ పరిశ్రమ అద్భుత అభివృద్ధి సాధించే అవకాశాలున్నాయి.
తమ పరిశ్రమద్వారా రాష్ట్రంలో ప్రత్యక్షంగా 1,100 మందికి ఉపాధి లభిస్తుందని గోకల్దాస్ ఇమేజెస్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ సుమిర్ హిందూజా మంత్రి కేటీఆర్కు తెలిపారు. ఉద్యోగుల్లో 75% మహిళలు ఉంటారని చెప్పారు. సిరిసిల్ల చుట్టుపక్కల గ్రామాల మహిళలకు రాష్ట్రప్రభుత్వంతో కలిసి అవసరమైన శిక్షణ ఇస్తామని వెల్లడించారు. తమ కంపెనీ నాలుగు దశాబ్దాలకుపైగా వస్త్రరంగంలో ఉన్నదని, రెడీమేడ్ వస్ర్తాల తయారీలో ముందువరుసలో ఉన్నదని చెప్పారు. తెలంగాణలో పెట్టుబడులకు అనుకూల వాతావరణం ఉన్నందునే ఇక్కడ కార్యకలాపాలు ప్రారంభించాలని నిర్ణయించినట్టు తెలిపారు. ప్రపంచస్థాయి బ్రాండ్లకు తమ కంపెనీ వస్ర్తాలను సరఫరా చేస్తున్నదని పేర్కొన్నారు. ప్రస్తుతం సిరిసిల్లలో ప్రారంభించబోయే యూనిట్ నుంచి అమెరికా, యూరప్లోని ప్రముఖ బ్రాండ్లకు దుస్తులను అందిస్తామని వివరించారు.
గోకల్దాస్ కంపెనీ రాష్ట్రంలో పెట్టుబడులు పెడుతున్నట్టు ప్రకటించటంపట్ల మంత్రి కేటీఆర్ సంతోషం వ్యక్తంచేశారు. టెక్స్టైల్ రంగాన్ని రాష్ట్రప్రభుత్వం ఇప్పటికే ప్రాధాన్యత రంగాల్లో చేర్చి అనేక కార్యక్రమాలు చేపడుతున్నదని తెలిపారు. రాష్ట్రంలో పరిశ్రమల అభివృద్ధికి అవసరమైన మౌలిక వసతుల కల్పనతోపాటు శిక్షణ కూడా చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. రాష్ట్రంలో టెక్స్టైల్ పరిశ్రమలో ఇప్పటిదాకా వస్ర్తాల తయారీ యూనిట్లే ఉన్నాయని, గోకల్దాస్ కంపెనీ రాకతో రెడీ టు వేర్/ రెడీమేడ్ గార్మెంట్స్ పరిశ్రమ ప్రస్థానం ప్రారంభమైందన్నారు. గోకల్దాస్ రాకతో రాష్ట్రంలోకి మరిన్ని అప్పారెల్ కంపెనీలు వస్తాయని ఆశాభావం వ్యక్తంచేశారు. గోకల్దాస్ కంపెనీకి అన్నిరకాల సహాయ సహకారాలను అందిస్తామని హామీఇచ్చారు. కార్యక్రమంలో పరిశ్రమలశాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్రంజన్, చేనేత, జౌళిశాఖ కార్యదర్శి శైలజా రామయ్యర్, టీఎస్ఐఐసీ ఎండీ వెంకటనరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.