హైదరాబాద్, ఆగస్టు 25 (నమస్తే తెలంగాణ): కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పంచభూతాలనూ అమ్మకానికి పెడుతుందా? అని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కే నారాయణ ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రజల కష్టార్జితంతో నిర్మితమైన ప్రభుత్వరంగ సంస్థలను అమ్మకానికి పెట్టడం దుర్మార్గమని పేర్కొన్నారు. ప్రభుత్వరంగ సంస్థల పట్ల బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా దేశంలోని జాతీయ, ప్రాంతీయ పార్టీలన్నీ ఏకమై పోరాడాల్సిన అవసరం ఉన్నదని చెప్పారు. ప్రభుత్వరంగ సంస్థల నిర్వహణను ప్రైవేట్కు అప్పగిస్తామని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ చేసిన ప్రకటనపై ఆయన మండిపడ్డారు. బీజేపీ ప్రభుత్వం ప్రైవేట్ వ్యక్తుల్లో కూడా తమకు కావాల్సిన అదానీ, అంబానీలకే అన్నీ దోచిపెడుతున్నదని విమర్శించారు. ముంబై విమానాశ్రయం నిర్వహిస్తున్న జీవీకే సంస్థను కేంద్రం పెద్దలే బెదిరించి, అదానీకి కట్టబెట్టారని, గంగవరం పోర్టు విషయంలోనే అదే జరిగిందని పేర్కొన్నారు. దేశంలోని రోడ్లు, రైల్వేలు, పోర్టులు, పరిశ్రమలు అన్ని అమ్మేసి దేశాన్ని దివాళా తీయించి, ప్రజలను ఆర్థిక ఇబ్బందులకు గురిచేస్తున్నారని దుయ్యబట్టారు. రూ.15 లక్షల కోట్ల విలువైన టెలికం రంగాన్ని అత్యంత చౌకగా రూ.30 వేల కోట్లకు అంబానికి అప్పగించి ప్రభుత్వరంగాన్ని నాశనం చేశారని విమర్శించారు. మరోవైపు, మనదేశం-మన సంపద-మన సంప్రదాయం అంటూ ప్రజలను బీజేపీ మోసం చేస్తున్నదని విమర్శించారు.