ముంబై : మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రేపై వివాస్పద వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి నారాయణ్ రాణే ( Narayan Rane ) ను ఇవాళ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. గడిచిన 20 ఏళ్లలో ఓ కేంద్ర మంత్రి అరెస్టు కావడం ఇదే మొదటిసారి. రాణేకు వ్యతిరేకంగా మహారాష్ట్రలో తాజాగా భారీ భారీ బ్యానర్లు పెట్టారు. కోంబ్డీ చోర్ అంటూ ఆ బ్యానర్లపై రాశారు. అంటే దాని అర్థం కోళ్ల దొంగ అని. నారాయణ్ రాణే ఒకప్పుడు పౌల్ట్రీ వ్యాపారం చేశారు. చెంబూరులో సుమారు అయిదు దశాబ్ధాల క్రితం ఆయన చికెన్ షాపును నడిపారు. ప్రస్తుతం బీజేపీ పార్టీలో ఉన్నా.. ఆయన రాజకీయ కెరీర్ మొదలైంది మాత్రం శివసేన పార్టీలోనే.
నారాయణ రాణే ప్రస్తుత వయసు 69 ఏళ్లు. బాల్థాకరే నేతృత్వంలోని శివసేన పార్టీలో ఆయన కీలక బాధ్యతలు నిర్వర్తించారు. 1990లో శివసేన ఎమ్మెల్యేగా రాణే పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. ఇక 1999లో మహారాష్ట్ర సీఎంగా బాధ్యతలు చేపట్టారు. చాలా స్వల్ప కాలం ఆయన సీఎంగా ఉన్నారు బీజేపీ-శివసేన కూటమిలో భాగంగా ఆయన అప్పట్లో ప్రభుత్వాన్ని నడిపారు.
మహారాష్ట్రలో ఉద్రిక్తతలను రెచ్చగొట్టేందుకు రాణే తాజా సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. బీజేపీలో మంచి పేరు సంపాదించాలన్న ఉద్దేశంతోనే ఆయన శివసేన పార్టీని అటాక్ చేస్తున్నట్లు ఎంపీ రౌత్ ఆరోపించారు. అయితే థాక్రేల కుటుంబంతో ఘర్షణ పడ్డ నారాయణ్ రాణే.. 2005లో శివసేన పార్టీని వీడారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరి మంత్రి అయ్యారు.
ఇక 2017లోనూ ఆయన కాంగ్రెస్ పార్టీకి గుడ్బై చెప్పారు. తనను సీఎం చెయ్యలేదన్న మనస్తాపంతో ఆ పార్టీకి వీడ్కోలు పలికారు. తన ఇద్దరు కుమారులు నీలేశ్, నితేశ్లతో కలిసి ఒక కొత్త పార్టీ పెట్టారు. కానీ ఆ పార్టీని ఆ తర్వాత బీజేపీలో చేర్చేశారు. ఇటీవల మోదీ సర్కార్లో కేంద్ర మంత్రి అయ్యారు. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల మంత్రిగా రాణే బాధ్యతలు స్వీకరించారు.
దేశానికి స్వాతంత్య్రం ఏ ఏడాదిలో వచ్చిందో తెలియని ఉద్ధవ్ థాక్రేను తాను కొడదామనుకున్నా అని రాణె సోమవారం జరిగిన జన ఆశీర్వాద సభలో అన్నారు. దీంతో రాణే, శివసేన మధ్య ఉన్న వైరం మళ్లీ భగ్గుమన్నది. రాణే అరెస్టును బీజేపీ నేత జేపీ నడ్డా ఖండించారు. రాజ్యాంగ విలువల ఉల్లంఘన అవుతుందని నడ్డా ఆరోపించారు. ఓ రాజకీయ నేత కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలో అరెస్టు కావడం 20 ఏళ్ల తర్వాత ఇదే ప్రప్రథమం.