Rane Vs Udhav | మహారాష్ట్రలో ఉద్ధవ్ ఠాక్రే సారధ్యంలోని మహా వికాస్ ఆఘాదీ సర్కార్ హిందు వ్యతిరేకి అని కేంద్ర మంత్రి నారాయణ్ రాణె ఆరోపించారు. దేశమంతా కరోనా మహమ్మారి థర్డ్ వేవ్ ముంచుకొస్తుందన్ని అల్లాడుతున్న నేపథ్యంలో మహారాష్ట్ర సర్కార్ వచ్చే రెండు నెలల వరకు ఆంక్షలు విధించింది. శుక్రవారం గణేశ్ చతుర్థి సందర్భంగా గణేశ్ నవరాత్రి ఉత్సవాలపైనా ఆంక్షలు అమలు చేస్తున్నట్లు ప్రకటించింది.
దీనిపై శుక్రవారం కేంద్రమంత్రి నారాయణ్ రాణే మండిపడ్డారు. కేవలం హిందువుల పండుగల సమయంలోనే మహారాష్ట్ర సర్కార్ ఆంక్షలు విధిస్తున్నదని ఆరోపణలు గుప్పించారు. ఇది తప్పని వ్యాఖ్యానించారు. హిందూత్వ గురించి మాట్లాడే శివసేన.. బీజేపీతో తెగదెంపులు చేసుకోవడంతోనే తన సిద్ధాంతాలకు తిలోదకాలిచ్చిందన్నారు.
ఇటీవల తాను ఆ స్థానంలో ఉంటే, ఉద్ధవ్ ఠాక్రేను చెంపదెబ్బ కొట్టేవాడినని నారాయణ్ రాణే చేసిన వ్యాఖ్య వివాదాస్పదమైంది. దీనిపై కేసు నమోదు కావడం.. పోలీసులు అరెస్ట్ చేయడం.. అటుపై బెయిల్పై విడుదల కావడం ఒకదాని వెంట మరొక ఘటన చకచకా జరిగిపోయాయి. అప్పటి నుంచి బీజేపీ, శివసేన మధ్య ఉప్పూనిప్పుగా ఉంటున్నది.