నల్లగొండ : సూర్యాపేటలో మాతా శిశు సంరక్షణ కేంద్రాన్ని రాష్ర్ట వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్, విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి కలిసి ప్రారంభించారు. రూ. 17 కోట్లతో 250 పడకలతో మాతాశిశు సంరక్షణ కేంద్రాన్ని నిర్మించారు.
ఈ సందర్భంగా మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. కొవిడ్ చికిత్సకు ప్రభుత్వం పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. కరోనా రోగులకు రాష్ర్టంలో ఆక్సిజన్ కొరత లేదని తేల్చిచెప్పారు. ఆస్పత్రుల్లో పడకలు దొరకడం లేదన్న పుకార్లు నమ్మొద్దు అని విజ్ఞప్తి చేశారు. ప్రజలు భయభ్రాంతులకు గురి కావొద్దు అని సూచించారు. కొవిడ్ రోగుల్లో 5 శాతం మందిలోనే అనారోగ్య సమస్యలు వస్తున్నాయని తెలిపారు. 99.5 శాతం మంది రికవరీ అవుతున్నారని పేర్కొన్నారు. ప్రతి ఆరోగ్య కేంద్రంలో కొవిడ్ టెస్టు పరికరాలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. ఇతర రాష్ర్టాలతో పోలిస్తే కొవిడ్ రోగులకు తెలంగాణ మెరుగైన సేవలందిస్తోంది అని ఈటల రాజేందర్ స్పష్టం చేశారు.