హోరాహోరీ పోరులో మమతపై విజయం
రౌండు రౌండుకూ మారిన ఆధిక్యం
1,736 ఓట్ల స్వల్ప మెజార్టీతో గెలుపు
కోల్కతా, మే 2: టీ20 మ్యాచ్ను తలపించిన ఎన్నికల ఫలితం ఇది.. నరాలు తెగే ఉత్కంఠ.. ఆద్యంతం రసవత్తరం.. రౌండ్ రౌండ్కూ మారిన ఆధిక్యం.. దేశవ్యాప్తంగా అత్యంత ఆసక్తి రేకెత్తించిన పశ్చిమబెంగాల్లోని నందిగ్రామ్ నియోజకవర్గం ఎన్నికల కౌంటింగ్ సస్పెన్స్ థ్రిల్లర్ను తలపించింది. ఆది నుంచి హోరాహోరీగా సాగిన ఈ పోరులో ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి 1,736 ఓట్ల స్వల్ప మెజార్టీతో విజయం సాధించారు. తొలుత మమత విజయం సాధించారని వార్తలు వెలువడగా.. అనంతరం సువేందు గెలిచినట్టు ఎన్నికల సంఘం ప్రకటించింది. కౌంటింగ్ ప్రారంభంలో సువేందు ఆధిక్యంలో దూసుకెళ్లారు. నాలుగు రౌండ్ల తర్వాత కూడా ఆయన 8వేల ఓట్ల ముందంజలో కొనసాగారు. ఆ తర్వాత మమత పుంజుకొని ఆధిక్యంలోకి వెళ్లారు. ఒక్కో రౌండ్ ఒక్కొక్కరి ఆధిపత్యం అన్నట్టు లెక్కింపు కొనసాగింది. 16 రౌండ్లు పూర్తయ్యేసరికి సువేందు మమత కంటే కేవలం 6 ఓట్ల ముందంజలో ఉన్నారు. చివరిదైన 17వ రౌండ్లో స్వల్ప ఆధిక్యంతో గెలుపుతీరాలకు చేరారు.
సన్నిహితుడే.. ప్రత్యర్థిగా మారి
నందిగ్రామ్ ఎన్నో ఏండ్లుగా అధికారి కుటుంబానికి పెట్టని కోటగోడ. 2016 ఎన్నికల్లో టీఎంసీ తరఫున పోటీచేసిన సువేందు 81వేల మెజారిటీతో గెలుపొందారు. ప్రస్తుత ఎన్నికలకు ముందు బీజేపీలో చేరారు. తనకు అత్యంత సన్నిహితుడైన సువేందు వెన్నుపోటు పొడిచారని భావించిన మమతాబెనర్జీ.. తన నియోజకవర్గం భవానీపురాన్ని వదిలి నందిగ్రామ్లో పోటీ చేయాలని నిర్ణయించుకొన్నారు. సువేందును అసెంబ్లీ గడప తొక్కనీయబోనని శపథం చేసి మరీ పోటీకి దిగారు.
బెంగాల్ ఫలితాలు ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు 2024లో జరిగే పార్లమెంటు ఎన్నికలపై కూడా ప్రభావం చూపుతాయి. దేశ ప్రజలు కేంద్రంలో నాయకత్వ మార్పును కోరుకుంటున్నారు. పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో బీజేపీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజీనామా చేయాలి.