కేదార్నాథ్: అద్వైత వేదాంతకర్త ఆదిశంకరాచార్య విగ్రహాన్ని ఇవాళ కేదార్నాథ్లో ప్రధాని మోదీ ఆవిష్కరించిన విషయం తెలిసిందే. కర్నాటకలోని మైసూరుకు చెందిన శిల్పి అరుణ్ యోగిరాజ్ ఆ విగ్రహాన్ని చెక్కారు. ఈ నేపథ్యంలో శిల్పి యోగిరాజ్ మాట్లాడుతూ.. ఆ అద్భుత ఘట్టం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఆదిశంకరుల విగ్రహాన్ని దేశానికి మోదీ అంకితం చేయడం ఆనందాన్ని కలిగిస్తోందన్నారు. శంకర భగవత్పాదుల విగ్రహాన్ని తయారు చేసేందుకు 9 నెలలు.. ప్రతి రోజు 15 గంటల పాటు పనిచేయాల్సి వచ్చిందని శిల్పి యోగిరాజ్ తెలిపారు. 2013లో ఉత్తరాఖండ్లో వచ్చిన వరదల్లో.. కేదార్నాథ్ ఆలయ వెనుక భాగంలో ఉన్న శంకరాచార్యుల సమాధి ధ్వంసమైంది. అయితే ఆ సమాధి స్థలంలోనే మళ్లీ శంకరాచార్య విగ్రహాన్ని ప్రతిష్టించారు. ప్రధాని మోదీ నేతృత్వంలో ఈ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా చేపట్టారు. కృష్ణశిలతో ఈ విగ్రహాన్ని రూపొందించారు.
ఆదిశంకరుల విగ్రహం తయారీ కోసం శిల్పి యోగిరాజ్ను ప్రధాని మోదీయే ఎన్నుకున్నారు. దీంతో ఆయన బాధ్యతలు మరింత పెరిగాయి. శంకరాచార్యుల విగ్రహం తయారీలో ప్రతి అంశాన్ని మోదీ వివరించారని, ఆయన చెప్పినట్లే తాను ఆ విగ్రహాన్ని తీర్చినట్లు అరుణ్ యోగిరాజ్ తెలిపారు. అనునిత్యం ప్రధాని మోదీ విగ్రహం తయారీపై అప్డేట్ తెలుసుకునేవారన్నారు. తొలుత రెండు అడుగల విగ్రహాన్ని తయారు చేసి దాని ఆధారంగా యోగిరాజ్ స్టడీ చేశారు. ఆధ్మాత్మిక గురువు శంకరుల విగ్రహం రూపొందించేందుకు దక్షిణ భారత దేశంలో పర్యటన చేయాల్సి వచ్చిందని శిల్పి యోగిరాజ్ చెప్పారు. శృంగేరి మఠంతో పాటు మైసూరులో ఉన్న శంకర మఠం నుంచి కూడా సూచనలు తీసుకున్నట్లు తెలిపారు. ప్రధానమంత్రి కార్యాలయం కొన్ని అంశాలను సూచించినా.. పూర్తిగా స్వేచ్ఛతో ఆ విగ్రహాన్ని చెక్కినట్లు చెప్పారు.
కృష్ణ శిలలుగా పిలువబడే నల్లరాయిపై శంకరాచార్య విగ్రహాన్ని చెక్కారు. యోగిరాజ్ శిల్పి తాతయ్య బసవన్న కూడా మహాశిల్పి. బీ బసవన్న శిల్పి అప్పట్లో మైసూరు ప్యాలెస్లో ఆస్థాన ఆర్టిస్టు. బసవన్న శిల్పికి 17 మంది మునిమనవళ్లు ఉన్నారు. వారిలో యోగిరాజ్ శిల్పి ఒకరు. మైసూరు ప్యాలెస్ ఆదేశాల మేరకు బసవన్న శిల్పి అప్పట్లో గాయత్రి ఆలయం, భువనేశ్వరి ఆలయాలను నిర్మించారు. కృష్ణ రాజసాగర డ్యామ్పై ఉన్న కావేరి విగ్రహం కూడా బసవన్న శిల్పి తయారు చేసిందే.
అరున్ యోగిరాజ్ 2008లో మైసూరు యూనివర్సిటీ నుంచి ఎంబీఏ పూర్తి చేశారు. ఆ తర్వాత ఓ ప్రైవేటు కంపెనీలో చేరారు. కానీ శిల్పకళపై దృష్టిమళ్లడంతో.. యోగిరాజ్ పూర్తి స్థాయి శిల్పిగా మారారు. మైసూరులోని జయచామరాజేంద్ర వడియార్, స్వామి రామకృష్ణ పరమహంస విగ్రహాలు యోగిరాజ్ శిల్పకళా నైపుణ్యానికి ప్రతీకలుగా నిలుస్తున్నాయి. కేదార్నాథ్లోని ఆదిశంకరుల దివ్యమూర్తి ఇప్పుడు యోగిరాజ్ ట్యాలెంట్కు మరో గీటురాయిగా మారింది.