న్యూఢిల్లీ: పెగాసస్ హ్యాకింగ్ గురించి రాహుల్ గాంధీ స్పందించారు. తనకు చెందిన అన్ని ఫోన్లను ట్యాపింగ్ చేశారని ఆయన ఆరోపించారు. మీడియాతో మాట్లాడుతూ రాహుల్.. తన ఫోన్ ట్యాపైందని, ఇదొక్కటే కాదు, అన్ని ఫోన్లు ట్యాపింగ్కు గురైనట్లు ఆయన చెప్పారు. తాను జరుపుతున్న అన్ని సంభాషణలను మానిటర్ చేసినట్లు ఆయన ఆరోపించారు. ఇంటెలిజెన్స్ బ్యూరో నుంచి తనకు ఫోన్స్ వస్తుంటాయని, వాళ్లు తన ఫోన్ ట్యాప్ చేశారని, తన సెక్యూర్టీని కూడా తన గురించి అడిగేవారన్నారు. ఎవరికీ భయపడేది లేదని, బెదిరింపులకు లొంగేదిలేదన్నారు. ఈ దేశంలో ఒకవేళ నువ్వు అవినీతి పరుడివో, దొంగవో అయితే అప్పుడు భయపడుతావని, నువ్వు ఏదీ కానప్పుడు, భయపడాల్సిన అవసరం లేదని రాహుల్ అన్నారు. పెగాసస్ స్పైవేర్ అంశంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ట్యాపింగ్ విషయంలో జ్యుడిషియల్ విచారణకు ఆదేశించాలన్నారు. పెగాసస్ స్పైవేర్ను ఇజ్రాయిల్ ప్రభుత్వం ఓ ఆయుధంగా పరిగణిస్తుందని, అలాంటి ఆయుధాన్ని సాధారణంగా ఉగ్రవాదులపై వాడాలని, కానీ ఈ దేశ ప్రధాని, హోం మంత్రులు.. వాటిని భారతీయ వ్యవస్థలు, వ్యక్తులపై వాడినట్లు రాహుల్ ఆరోపించారు.