న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ద్వారా.. వాటిల్లో వాటాల ఉపసంహరణ ద్వారా ఆదాయం సమకూర్చుకోవాలన్న లక్ష్యాన్ని సాధించేందుకు కేంద్రం క్రుతనిశ్చయంతో ముందుకు సాగుతోంది. నష్టాలు, రుణాల ఊబిలో చిక్కుకున్న ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియాను ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే ప్రైవేటీకరించాలని కేంద్రం విధానాన్ని ఖరారు చేసినా కరోనా మహమ్మారి వల్ల ఆచరణకు నోచుకోలేదు. మహారాజాగా పేరొందిన ఎయిర్ ఇండియాతోపాటు లాభాల్లో ఉన్న కేంద్ర చమురు సంస్థ భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్) తదితర ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ వ్యూహానికి శ్రీకారం చుట్టనున్నది కేంద్రం.
2021-22లో మహారాజా (ఎయిర్ ఇండియా), బీపీసీఎల్ సంస్థలతో కేంద్రం తన ప్రైవేటీకరణ వ్యూహాన్ని అమలు చేయనున్నట్లు కనిపిస్తున్నది. ‘పెట్టుబడుల ఉపసంహరణ జాబితాలో చేర్చిన సంస్థల్లో ఎయిరిండియా, బీపీసీఎల్లో వాటా విక్రయ ప్రక్రియ చివరి అంకానికి చేరుకున్నది. ముందుగా వీటి ప్రైవేటీకరణ ప్రక్రియ తొలి లేదా రెండో త్రైమాసికంలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం’ అని కేంద్ర ప్రభుత్వ అధికారి ఒకరు చెప్పారు.
కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనల్లో ఎయిర్ ఇండియా, బీపీసీఎల్తోపాటు కాంకర్, షిప్పింగ్ కార్పొరేషన్ సంస్థలు ఉన్నాయి. ఎల్ఐసీలో ఐపీవోకు వెళ్లాలని భావిస్తున్నది. ఎల్ఐసీ ఐపీవో ద్వారా రూ.90 వేల కోట్ల ఆదాయం లభిస్తుందని అంచనా. బీపీసీఎల్లో వాటా కొనుగోలుకు వేదంతా రిసోర్సెస్, అపోలో గ్లోబల్, ఐస్క్వేర్డ్ కేపిటల్, ఎయిరిండియా కోసం స్పైస్జెట్, టాటా సన్స్, పవన్ రుయా ఆసక్తి చూపాయి. వచ్చే ఆర్థిక సంవత్సరంలో పవన్హన్స్, ఎన్ఐఎన్ఎల్తోపాటు రెండేసీ ప్రభుత్వ రంగ బ్యాంకులు, సాధారణ బీమా కంపెనీలు ప్రైవేటీకరణ జాబితాలో ఉన్నాయి.