న్యూఢిల్లీ: భారత్లో కరోనా పరిస్థితులు తన హృదయాన్ని కలిచివేస్తున్నాయని జర్మనీ రాయబారి వాల్టర్ జె. లిండ్న్ర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆసుపత్రులలో పడకల కోసం ప్రజలు ఎదురుచూడటం, ఆక్సిజన్, మందుల కోసం పడుతున్న ఇబ్బందిని సామాజిక మాధ్యమాల్లో చూసి తన మనసు ద్రవించిపోతున్నదని తెలిపారు. వీటిని తట్టుకుని నిలబడే శక్తి భారత ప్రజలకు ఉందన్నారు. తాను సగం భారతీయుడ్ని, సగం జర్మన్ వ్యక్తినని చెప్పారు.
మనంతా కలిసికట్టుగా ఈ కరోనా కష్టకాలం నుంచి బయటపడతామని వాల్టర్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఏదో ఒక రోజు భారత్ అందాన్ని తిరిగి చూస్తామన్నారు. భారత ప్రజలంతా కరోనా టీకా వేయించుకోవాలన్నదే తన సందేశమని, ఇది చాలా ముఖ్యమని తెలిపారు. భారత్లో రెండు కరోనా టీకాలు దేశీయంగా ఉత్పత్తి అవుతున్నాయని చెప్పారు.