న్యూఢిల్లీ: కరోనా సమయంలో కేజ్రీవాల్ సర్కార్ ఆక్సిజన్ అవసరాన్ని నాలుగు రెట్లు అత్యధికంగా చేసి చూపించిందన్న సుప్రీం ప్యానల్ మధ్యంతర నివేదిక పేర్కొనడం దుమారం రేపుతున్నది. ఇదే విషయాన్ని బీజేపీ ప్రస్తావిస్తూ.. కేజ్రీవాల్ ప్రభుత్వంపై దుమ్మెత్తి పోస్తున్నది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ట్విట్టర్ వేదికగా స్పందించారు.
‘ఢిల్లీకి చెందిన 2 కోట్ల మంది ప్రజల కోసం పోరాడటమే నేను చేసిన పెద్ద నేరం. ఆ సమయంలో ప్రధాని మోదీ ఎన్నికల ర్యాలీల్లో బిజీబిజీగా ఉండిపోయారు. ఆ సమయంలో నేను అహోరాత్రులు శ్రమించి, ఢిల్లీ ప్రజలకు ఏర్పడ్డ ఆక్సిజన్ కొరతను నివారించగలిగాను. కరోనా కారణంగా ప్రజలు తమతమ కుటుంబీకులను కోల్పోయి, తీవ్ర మనోవేదనలో మిగిలిపోయారు. లేనిపోని తప్పులు చెప్పకండి. వారికి అసహ్యం వేస్తున్నది’ అంటూ ముఖ్యమంత్రి ట్విట్టర్ వేదికగా స్పందించారు.