ముంబై: ఇంగ్లిష్ క్రికెటర్ ఓలీ రాబిన్సన్ జాతి వివక్ష వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడ్డాడు టీమిండియా మాజీ క్రికెటర్ ఫరూఖ్ ఇంజినీర్. అతన్ని వెనకేసుకొచ్చినట్లు మాట్లాడిన బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్పైనా ఆగ్రహం వ్యక్తం చేశాడు. న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో టెస్ట్ అరంగేట్రం చేసిన రాబిన్సన్ తాను టీనేజర్గా ఉన్న సమయంలో ఆసియా వాసులు, ముస్లింలపై జాతి వివక్ష ట్వీట్లు చేశాడన్న ఆరోపణలపై అతన్ని అంతర్జాతీయ క్రికెట్ నుంచి సస్పెండ్ చేసింది ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు. అయితే ఈ నిర్ణయాన్ని బ్రిటన్ ప్రధాని జాన్సన్ ప్రశ్నించారు.
ఇందులో తప్పేముందని ఇప్పుడు ఫరూక్ ఇంజినీర్ ప్రశ్నించాడు. ఈసీబీ మంచి పనే చేసిందని, జాతి వివక్ష వ్యాఖ్యలను ఉపేక్షించకూడదని అతడు స్పష్టం చేశాడు. ఈ సందర్భంగానే ఫరూక్ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ జెఫ్రీ బాయ్కాట్ తరచూ బ్లడీ ఇండియన్స్ అంటుంటేవాడని, అలాంటిది ఇప్పుడదే క్రికెటర్లు ఐపీఎల్ ప్రారంభమైనప్పటి నుంచి మన బూట్లు నాకుతున్నారని ఫరూక్ అనడం విశేషం. డబ్బు కోసం వాళ్లు ఎంతకైనా దిగజారుతారని, వాళ్ల నిజస్వరూపమేంటో తనకు తెలుసని చెప్పాడు.
ఇప్పుడు ఇండియా వాళ్లకు మంచి దేశంగా కనిపిస్తోందని, ఐపీఎల్ టైమ్లో కొన్ని నెలలు ఉండి డబ్బు వెనకేసుకొని వెళ్తున్నారని అన్నాడు. ఇంగ్లండ్ క్రికెటర్లే కాదు ఆస్ట్రేలియా క్రికెటర్లు కూడా ఇండియన్స్పై ఇలాంటి వ్యాఖ్యలు చేశారని ఫరూక్ చెప్పాడు. తాను ఆడే రోజుల్లో లాంకషైర్ కౌంటీకి ఫరూక్ ప్రాతినిధ్యం వహించేవాడు. తనను కూడా ఇండియన్ అని అదోలా చూసేవారని, కానీ తన ఆట, వాళ్ల కన్నా మంచి ఇంగ్లిష్ మాట్లాడే నైపుణ్యంతో తనేంటో, ఇండియన్స్ ఏంటో వాళ్లకు చూపించానని ఫరూక్ చెప్పాడు.
జాతి వివక్ష వ్యాఖ్యలు చేసే క్రికెటర్లను ఉపేక్షించకూడదని స్పష్టం చేశాడు. వాళ్లను జీవితకాలం నిషేధించాలని కాదు. కానీ ఒక టెస్ట్ సిరీస్కో లేదా కొన్నాళ్లు డొమెస్టిక్ క్రికెట్ ఆడకుండా సస్పెండ్ చేయాలని ఫరూక్ సూచించాడు. ఇండియా తరఫున ఫరూక్ 46 టెస్టులు ఆడాడు.