ముంబై, మార్చి 13: పలుమార్లు హెచ్చరించినప్పటికీ పట్టించుకోకుండా మాస్కును సరిగా ధరించని ప్రయాణికులను విమానం నుంచి దింపేయాలని విమానయాన సంస్థలను డీజీసీఏ (పౌరవిమానయాన డైరక్టరేట్ జనరల్) ఆదేశించింది. కరోనా కేసులు మళ్లీ పెరగుతున్న నేపథ్యంలో ప్రయాణికులు మాస్కును ముక్కు కిందికి కాకుండా సరిగా ధరించేలా చూడాలని, తప్పనిసరిగా భౌతికదూరం పాటించేలా చర్యలు తీసుకోవాలని ఈ ఆదేశాల్లో స్పష్టం చేశారు. కరోనా నిబంధనలను పాటించకుండానిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ప్రయాణికులను విమానాశ్రయాల్లోని భద్రతా సిబ్బందికి అప్పగించాలని సూచించారు. అవసరమైతే అలాంటి ప్రయాణికులపై భద్రతా సంస్థలు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.